ప్రొఫెసర్ కోదండరాం అరెస్టు..! యురేనియం తవ్వకాలకు నిరసనగా చేస్తున్న ధర్నాకు మద్దత్తు..!!
నాగర్కర్నూల్/హైదరాబాద్ : జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండ రాం మరోసారి అరెస్టయ్యారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు నిరసనగా ధర్నా చేస్తున్న స్థానికులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న కోదండ రాం ను మార్గం మద్యలోని హాజీ పూర్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20జీబుల్లో వచ్చిన పోలీసులు అకస్మాత్తుగా కోదండరాం ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపేసి ఆయనను ధర్నా ప్రదేశానికి వెళ్లకుండా నియంత్రించారు.
ఆ తర్వాత కోదండ రాం ని అక్కడ నుండి తరలించారు. అంతకు ముందు యురేనియం తవ్వకాలతో పర్యవరణానికి కలిగే నష్టం పై పలువురు అఖిల పక్ష నేతలు తమ అభిప్రాయాలను తెలియజేసారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వారికి మద్దత్తు ప్రకటించారు.
ఇదిలా ఉండగా యురేనియం తవ్వకాలతో అభివృద్ధి పేరిట వినాశనానికి పాలకవర్గాలు కుట్ర చేస్తున్నాయని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. నల్లమలలో యురేనియం తవ్వకాల అన్వేషణకు సంబంధించిన అనుమతులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి, చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి, ప్రజా కళా మండలి నాయకులు రాంచందర్, టీపీఎఫ్ నేత మన్యం, వరంగల్ రచయితల సంఘం నాయకులు నల్లెల రాజయ్య, విరసం నేత బాలస్వామి, రాజయ్యలతో కలిసి గురువారం నల్లమల ఏజెన్సీ ప్రాంతంలోని పదర మండలం పెట్రాల్చేను, ఉడిమిళ్ల, చిల్లంకుంటలలో పర్యటించారు. ఈ సందర్భంగా యురేనియం తవ్వకాల వల్ల సంభవించే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించడంతో పాటు ఇందుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత హరగోపాల్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కోదండరాం పాల్గొనాల్సి ఉండగా ఆయనను పోలీసులు అరెస్టు చేసారు.