విజిలెన్స్ తనిఖీలన్నీ వసూళ్ల మయమే..! : కేసీఆర్ ప్రభుత్వంపై కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ పనితీరును ఎండగట్టడంలో దూకుడు పెంచిన ప్రొఫెసర్ కోదండరామ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ విద్యా వ్యవస్థకు సంబంధించి ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నకోదండరామ్.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన విజిలెన్స్ తనిఖీలన్నీ వసూళ్ల మయమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ నూతన విద్యా విధానంపై సదస్సులో చర్చ జరగ్గా.. విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు కోదండరామ్. ప్రస్తుతం కాలేజీల్లో కనీస మౌళిక బోధనా ప్రమాణాలు కరువయ్యాయని చెప్పుకొచ్చిన కోదండరామ్, ఫీజు రీయింబర్స్ మెంట్ వ్యవహారమంతా అవినీతిమయంగా మారిందని ఆరోపించారు.
ఇక విద్యా వ్యవస్థలో లోపాలను సవరించేందుకు గాను ప్రభుత్వం చేపట్టిన తనిఖీలు వసూళ్ల కోసమే జరిగాయని ఆరోపించారు కోదండరామ్. విజిలెన్స్ తనిఖీలనేవి తాత్కాలిక ఉపశనమం మాత్రమేనని చెప్పిన కోదండరామ్.. విజిలెన్స్ తనిఖీలన్నీ ఆయా యాజమాన్యాల నుంచి ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నవేనన్నారు.
వసూళ్ల కోసమే విజిలెన్స్ తనిఖీలు జరిగాయన్నది జగమెరిగిన సత్యమని చెప్పుకొచ్చారు కోదండరామ్. ఈ తనిఖీల వల్ల విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పేమి లేదన్న కోదండరామ్, విద్యా వ్యవస్థలో అసలు పర్యవేక్షణే లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పర్యవేక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే.. ప్రభుత్వ ప్రైవేటు విద్యా వ్వవస్థలు పతనమయ్యి కార్పోరేట్ విద్య బలపడుతుందన్నారు. దీన్ని అడ్డుకోవాలంటే ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని తద్వారానే మార్పు సాధ్యమని సూచించారు.
ఇక డైట్ సెట్ నోటిఫికేషన్ ను తక్షణం వెలువరించాలని డిమాండ్ చేసిన కోదండరామ్.. డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియంతా గందరగోళంగా తయారైందన్నారు. డిగ్రీ ప్రవేశాల్లో సీబీసీఎస్, విజిలెన్స్ తనిఖీలు యూనివర్సిటీల ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయన్న ఆయన.. దీనివల్ల విశ్వ విద్యాలయాల స్వయంప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందన్నారు.