ఆఖరిఘడియల్లో శ్వాసపీల్చే జంతువులా జీవిస్తున్నా: భార్యకు రాసిన లేఖలో సాయిబాబా ఆవేదన
90 శాతం వైకల్యంతో ఉన్న డా. జి.ఎన్. సాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేసి నాగ్పూర్ అండాసెల్ జైలులో బంధించారు. అక్కడ అనుభవిస్తున్న బాధల గురించి భర్య వసంతకు రాసిన లేఖలో గోడు వెళ్లబోసుకున్నారు సాయిబాబా.
హైదరాబాద్: తన జీవిత కాలంలో అత్యధిక విలువైన సమయాన్నితెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకే కేటాయించారాయన. దేశంలో ఆదివాసులు, దళితులు, ముస్లింలు, మహిళలు, రైతాంగం, కార్మికులు, విద్యార్థులు, మొత్తం పీడిత వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరుపున పోరాటం చేశారు.
ఆయనే.. ప్రొఫెసర్ సాయిబాబా. కానీ ఆయన మావోయిస్టు పార్టీ సభ్యుడంది ప్రభుత్వం, మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ అర్బన్ కనెక్ట్గా చిత్రీకరిస్తూ కుట్రపూరితంగా చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
90 శాతం వైకల్యంతో ఉన్న డా. జి.ఎన్. సాయిబాబాను రాజకీయ విశ్వాసాల కారణంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నాగ్పూర్ అండాసెల్ జైలులో బంధించారు. అక్కడ అనుభవిస్తున్న బాధల గురించి భర్య వసంతకు రాసిన లేఖలో గోడు వెళ్లబోసుకున్నారు సాయిబాబా.
రాబోయే చలికాలాన్ని తలచుకుంటేనే భయం వేస్తోందని.. ఇప్పటికే జ్వరంతో వణికిపోతున్నానని భార్య వసంతకు రాసిన లేఖలో సాయిబాబా తాను అనుభవిస్తున్న బాధను వెల్లడించారు. నవంబర్ నుంచి మొదలయ్యే చలికాలంలో బతికి ఉండడం తనకు అసాధ్యమని సాయిబాబా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
తాను ఆఖరిఘడియల్లో శ్వాస పీల్చే జంతువులా జీవిస్తున్నానంటూ తన దుర్భర జీవితాన్ని ఆ లేఖలో సాయిబాబా స్పష్టంగా చెప్పారు. సీనియర్ న్యాయవాదిని ఖరారు చేసి అక్టోబర్ లేదా నవంబర్ నెలలో తన బెయిల్ పిటిషన్ దాఖలు చేయమని గాడ్లింగ్కి తెలపాలంటూ పేర్కొన్నారు. వీలైనంత త్వరలో ఇది జరగాలని, లేకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని సాయిబాబా తన భార్య వసంతకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
ఒక నిర్భాగ్యుడిలా, బిక్షగాడిలా పదే పదే ప్రాధేయడాల్సి రావడం తనను కుంగదీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీమతి రెబికా, నందిత నారాయణ్, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులతో మాట్లాడి మొత్తం పరిస్థితిని వారికి చెప్పాలని సాయిబాబా ఆ లేఖలో తన భార్యను కోరారు.