ఏపీ, తెలంగాణా మధ్య బస్సు సర్వీసులపై చర్చల్లో పురోగతి... అయినా వీడని ప్రతిష్టంభన.. ఇంకోసారి చర్చలు
తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్ధరణకు సంబంధించి జరుగుతున్న చర్చలు మరోమారు ఎటూ తేలకుండా ముగిశాయి. అంతర్ రాష్ట్రాల మధ్య బస్సులను పునరుద్ధరించడం, ఎన్ని కిలోమీటర్లు బస్సులను నడపాలన్న దానిపైన భేటీ అయిన అధికారులు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం పెట్టిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొగ్గు చూపింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించే కిలోమీటర్ల మేర, బస్సులను పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
ఏపీ, తెలంగాణా బస్సుల రవాణాపై వీడని సస్పెన్స్ ... నేడు మరోమారు భేటీ .. చర్చలు ఫలిస్తాయా!!
బస్సు సర్వీసులను పెంచటంపై ఆలోచిస్తున్న తెలంగాణా
తెలంగాణ ప్రభుత్వం బస్సులను పెంచడం తమకు లాభదాయకం కాదని చెప్పింది. అంతేకాదు ఏఏ రూట్లలో ఎన్ని బస్సులు పెంచితే బావుంటుందన్న దానిపై ప్రపోజల్స్ ఇవ్వాలని ఆలోచిస్తామని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రస్తుతం బస్సు సర్వీసులను నడపడానికి ఓకే చెప్పాలని ఏపీ ప్రభుత్వం కోరినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం మొత్తం అంశాలపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే బస్సులు నడుపుదామని తేల్చింది. దీంతో మరో రెండు రోజుల్లో అధికారులు మరోమారు భేటీ అయ్యి సమస్య పరిష్కారానికి చర్చలు జరుపబోతున్నట్లుగా తెలుస్తుంది.
50 % కిలోమీటర్లను తగ్గించేందుకు ఏపీ రెడీ .. తెలంగాణా ముందు ప్రపోజల్స్
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రవాణాపై భేటీ అయిన ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశం ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఎటూ తేల్చకుండానే ముగిసింది. చర్చలు అర్ధాంతరంగా ముగియడంతో ప్రతిష్టంభన నెలకొంది. సమావేశం అనంతరం ఏపీఎస్ ఆర్టీసీ ఎండి కృష్ణ బాబు చర్చలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వంతో కిలోమీటర్ల పై ప్రధానంగా చర్చ జరిగిందని, ఏయే రూట్లలో ఎన్ని బస్సులు నడపాలని అంశంపైన కూడా చర్చించామని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలు సమాన కిలోమీటర్లు నడవడానికి ఏపీ ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆయన చెప్పారు. కిలోమీటర్ల గ్యాప్ 50% తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తెలంగాణ ఆర్టీసీని 50 శాతం పెంచుకోమని చెప్పామని కృష్ణ బాబు పేర్కొన్నారు.
గ్యాప్ తగ్గిస్తాం .. తెలంగాణా సర్వీసులు పెంచమంటున్న ఏపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు 3.43 లక్షల కిలోమీటర్లు ఏపీ బస్సులు నడిచేవి. రెండు తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2.65 లక్షల కిలోమీటర్ల మేర మాత్రమే ఏపీ బస్సులు నడుస్తున్నాయి. ఏపీ 71 రూట్లలో బస్సులను నడిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఏపీ నడుపుతున్న కిలోమీటర్లలో 1.1 లక్ష కిలోమీటర్ల వరకు రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ ఉంది. ఇక ఏపీ ప్రభుత్వం 50 వేల కిలోమీటర్ల గ్యాప్ తగ్గించడానికి మొగ్గు చూపుతుంది. ఆ 50 వేల కిలోమీటర్ల గ్యాప్ ను తెలంగాణ రాష్ట్రం పెంచితే బాగుంటుందని ప్రతిపాదించింది.
తెలంగాణా కూడా 50 వేల కిలోమీటర్ల మేర పెంచటానికి సిద్ధం
తెలంగాణ రాష్ట్రం కేవలం 28 రూట్లలోనే ఏపీలో బస్సులను తిప్పుతుంది. అవి పెంచుకుంటే బాగుంటుందని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఏపీ ఉన్నతాధికారులు తెలంగాణ ముందు ప్రపోజల్స్ పెట్టారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నడిపిస్తున్న 1.10 వేల కిలోమీటర్ల నుండి 1.60వేల కిలోమీటర్ల వరకు పెంచటానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తోంది. అంతకుమించి తమకు సామర్థ్యం లేదని, ఒకవేళ పెంచిన తమకు లాభదాయకం కాదని చెప్తోంది. ఇక ఇదే సమయంలో ఏయే రూట్లలో బస్సులు రన్ చేస్తే బాగుంటుందన్న దానిపై ఏపీని ప్రపోజల్ ఇవ్వమని కోరింది.
ఏకాభిప్రాయం కుదిరాకే .. అగ్రిమెంట్ మేరకే .. బస్సుల రవాణాకు గ్రీన్ సిగ్నల్
తుది నిర్ణయం తీసుకునే వరకు ఇరు రాష్ట్రాల రెండు వందల యాభై వేలు చొప్పున నడిపేందుకు అనుమతి ఇస్తే బాగుంటుందని ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా, ఫైనల్ డెసిషన్ అయిన తర్వాతనే బస్సులు నడుపుదామని తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి చెప్పింది. రూట్ల వారిగా క్లారిటీ కావాలని, రెండు రాష్ట్రాలు అగ్రిమెంట్ చేసుకోవాలని , తెలంగాణ పెట్టిన ప్రతిపాదనలు, ఏపీ అధికారులు చెబుతున్న అంశాలు అన్నింటిపై ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే బస్సులు రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు. ఏది ఏమైనా ఇరు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సుల రవాణాకు ఆర్టీసీ చర్చలు ఒక కొలిక్కి రాకపోవటంతో మరోమారు ఎటూ తేలకుండా ప్రతిష్టంభన నెలకొంది.