తస్సాదియ్య.. పదోన్నతులు కూడా ప్రవాహంలా పడిపాయె..! అమాత్యుల అండ ఉంటే అంతే మరి..!!
హైదరాబాద్ : సచివాలయంలో పని చేస్తున్న వేల ఉద్యోగుల్లో ఆయనొక్కడు! కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఆయన ప్రత్యేకం! ప్రభుత్వ పెద్దలకు కావాల్సినవాడు! అందుకే, ఐదేళ్లలో నాలుగు పదోన్నతులు ఇచ్చి సత్కరించింది! ఉత్తమ ఉద్యోగి బహుమతి ప్రదానం చేసింది! కీలక విభాగాలను అప్పగించింది! ఆయనతో చేరిన ఉద్యోగులు ఇంకా ఏఎస్ వోలు, అసిస్టెంట్ సెక్రటరీలుగానే ఉన్నారు! ఆయన మాత్రం అదనపు కార్యదర్శి అయిపోయారు. ఆయనే.. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాధవరం నరేందర్రావు! పదోన్నతులు ఇవ్వాలంటే కనీసం రెండు నుంచి మూడేళ్ల సర్వీసు ఉండాలి. నరేందర్రావు విషయంలో మాత్రం ఈ నిబంధనలేవీ పాటించలేదు! 2014 జూన్ నుంచి 2019 ఏప్రిల్లోపు ఏకంగా నాలుగు పదోన్నతులు కట్టబెట్టారు.
5 ఏళ్లలో 4 పదోన్నతులు..! ఇదెక్కడి న్యాయమంటున్న సచివాలయ ఉద్యోగులు...!!
2014లో సహాయ కార్యదర్శి, 2016లో ఉప కార్యదర్శి, 2018లో సంయుక్త కార్యదర్శి, 2019లో ఏకంగా అదనపు కార్యదర్శిగా పదోన్నతులు ఇచ్చేశారు. రిజర్వ్ కేటగిరీలో ఉన్నవారికి కూడా ఈ సమయంలో రెండు పదోన్నతులు వచ్చిన దాఖలాలు లేవు. నరేందర్ రావుకు పదోన్నతులపై తోటి ఉద్యోగులే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే, 1996లో ఆరుగురు సహాయ సెక్షన్ అధికారు (ఏఎస్ వో)లుగా నియమితులయ్యారు. వారిలో ఐదుగురు ఇంకా సహాయ కార్యదర్శులుగానే పని చేస్తున్నారు. కానీ, ఒక్క నరేందర్ రావు మాత్రం అదనపు కార్యదర్శి అయిపోయారు.
పదోన్నతులే.. బదిలీల్లేవు..! ఏఎస్ వో నుంచి అదనపు కార్యదర్శిగా..!!
నిబంధనల ప్రకారం పదోన్నతి రాగానే ఆ శాఖ నుంచి బదిలీ చేసి ఇతర చోట్ల పోస్టింగు ఇవ్వాలి. సెక్షన్ ఆఫీసర్(ఎఎస్వో) నుంచి అదనపు కార్యదర్శి దాకా పదోన్నతి వచ్చిన తర్వాత కూడా ఒకే పోస్టులో కొనసాగిస్తూ.. ఆ పోస్టును అప్గ్రేడ్ చేసుకుంటూ పోవడం గమనార్హం. తెలంగాణ సచివాలయంలో ఉద్యోగ సంఘం నాయకుడి విషయంలో పోటీపడి పదోన్నతులిస్తూ అధికారయంత్రాంగం ఆయన సేవలో తరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే మరోసారి ప్రమోషన్..! నిబంధనలకు పాతర..!!
ఇక శాఖా పదోన్నతుల కమిటీ(డీపీసీ) ఎన్నికల కోడ్ను పక్కనపెట్టి మరీ 8 మంది ఉద్యోగులకు అదనపు కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించడానికి ఆమోదం తెలిపింది. నిబంధనల ప్రకారం వరుస క్రమంలో సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు రావాలి. కానీ, అట్టుడుగున (8వ స్థానంలో) ఉన్న నరేందర్రావుకు తొలుత పదోన్నతి కల్పించి, పైనున్న ఏడుగురికి ఎన్నికల కోడ్ ముగిశాకే పోస్టింగు ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. ఇదెక్కడి న్యాయం అంటూ సాటి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయ ఉద్యోగుల సంఘం నరేందర్రావు హవా..!!
నిబంధనల ప్రకారం గెజిటెడ్ అధికారులు సంఘాల్లో పనిచేయాలంటే విధిగా సంబంధిత శాఖ అధిపతి నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ, నరేందర్రావు అసలు అనుమతి కోసం దరఖాస్తు కూడా చేయలేదని తెలుస్తోంది. అడ్డదిడ్డంగా పదోన్నతులు పొందడమేగాక ఒకే శాఖలో.. అందులోనూ కీలకమైన విభాగాలను తన ఆధీనంలో ఉంచుకోవడం విమర్శలకు తావిస్తోంది. డిప్యూటీ, జాయింట్ కలెక్టర్ల పోస్టింగ్ వ్యవహారాలతో పాటు భూముల కేటాయింపు, సేకరణ, జాగీర్ వ్యవస్థ, యూఎల్సీ, రిజిస్ట్రేషన్ల శాఖతో పాటు కీలక విభాగాలన్నీ ఆయన వద్దే ఉంచారన్న విమర్శలు ఉన్నాయి. అధికారాల్లేని, ఆదాయం లేని శాఖలనే మిగతావారికి వదిలేశారని ఉద్యోగులు మండిపడుతున్నారు.