అసలేంటీ వివాదం?: సీబీఐటీలో ఏం జరుగుతోంది.., ఆ బలహీనతనే క్యాష్ చేసుకుంటున్నారా!
హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల ఇష్టానుసార వసూళ్లపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. అడ్మిషన్ సమయంలో చెప్పిన చెల్లించిన ఫీజు కాకుండా.. తీరా విద్యా సంవత్సరం మధ్యలో అదనపు ఫీజు చెల్లించాలని మెలికపెట్టడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
షాక్ తింటున్న బీటెక్ విద్యార్థులు: ఎందుకిలా?, టాప్ కాలేజీల్లోను ఇలాంటి పరిస్థితా?..
హైదరాబాద్ లోని ప్రముఖ సీబీఐటీ కాలేజీ కూడా ఇటీవల ఫీజులు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో విద్యార్థులంతా రోడ్డెక్కి గత నాలుగు రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. సోమవారం కూడా విద్యార్థులు రోడ్డెక్కడం.. పోలీసులు వారిని అడ్డుకోవాలని చూడటంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
అసలేంటీ వివాదం?:
తెలంగాణ రాష్ట్ర ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) సిఫారసు మేరకే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ సీబీఐటీ లాంటి కాలేజీలకు మాత్రం ఆ నిబంధనలు పట్టడం లేదు. అడ్మిషన్ తీసుకున్న సమయంలో చెల్లించిన ఫీజు కాకుండా.. అమాంతం వేలల్లో ట్యూషన్ ఫీజు పెంచేసింది.
ట్యూషన్ ఫీజును రూ.1,13,500 నుంచి రూ.2 లక్షలకు పెంచడమే కాకుండా.. వారం రోజుల్లోగా ఫీజులు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్క తప్పలేదు.
అదో మెలిక:
అదనపు ఫీజుల వసూళ్ల కోసం సీబీఐటీ లాంటి కాలేజీలు ముందే మెలిక పెడుతుండటం గమనార్హం. అడ్మిషన్ సమయంలో ఇచ్చే ఫీజు రిసీట్ లపై షరతులు వర్తిస్తాయని పేర్కొంటున్నారు. బలవంతంగా తల్లిదండ్రుల చేత సంతకాలు చేయించుకుంటున్నారు. దీంతో విద్యా సంవత్సరం మధ్యలో ఫీజులు పెంచినా.. తాము ముందే చెప్పామన్న తరహాలో యాజమాన్యం తీరు కనిపిస్తోంది.
ర్యాలీ.. ఉద్రిక్తత:
ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన సోమవారానికి ఐదో రోజుకు చేరుకుంది. సీబీఐటీ విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ, ఇతర స్టూడెంట్ యూనియన్స్ కూడా మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో విద్యార్థులు గండిపేట్ నుంచి సీబీఐటీ కాలేజీ వరకు ర్యాలీ చేపట్టారు.
శంకర్పల్లి చౌరస్తాలో సీబీఐటీ కాలేజీ బస్సులను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు.
కాలేజీని తప్పు పట్టిన కడియం:
విద్యా సంవత్సరం మధ్యలో ఫీజులు పెంచడం సరికాదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇదివరకే చెప్పారు. అయితే తల్లిదండ్రులు కూడా అడ్మిషన్ల సమయంలోనే అఫిడవిట్ తీసుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు.సీబీఐటీతో పాటు ఇతర ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
అయితే ట్యూషన్ ఫీజుల పెంచుకోవచ్చని కోర్టు తీర్పులు వెలువడిన నేపథ్యంలో ఆ తీర్పులపై అదే కోర్టులో ప్రభుత్వం వెకేట్ పిటిషన్ దాఖలు చేసింది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లేందుకైనా ప్రభుత్వం సిద్దంగా ఉందని టీఏఎఫ్ఆర్సీ అధికారి రామారావు తెలిపారు.
మూడేళ్లకు ఒకసారి మాత్రమే:
రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్, మెడికల్, వృత్తి విద్యా కాలేజీల్లో మూడేళ్లకు ఒకసారి ట్యూషన్ ఫీజుల జాబితాను తయారుచేస్తున్నారు. రిటైర్డ్ జడ్జి స్వరూప్రెడ్డి చైర్మన్గా ఏర్పాటుచేసిన తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) 2016-17లో ట్యూషన్ ఫీజులను ఖరారు చేసింది.
తిరిగి 2019-10 విద్యాసంవత్సరంలో ట్యూషన్ ఫీజులను సమీక్షించాల్సి ఉంది. ఆదాయ లెక్కలు ప్రకారం యాజమాన్యాల అంగీకారం తీసుకున్నాకే ప్రభుత్వం జీవోరూపంలో ట్యూషన్ ఫీజులను ఖరారు చేస్తుంది. నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రైవేటు కాలేజీలు కోర్టులను ఆశ్రయిస్తున్నాయి.
ఆ బలహీనతనే క్యాష్ చేసుకుంటున్నారు:
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిన తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే కాలేజీల సంఖ్య తగ్గిపోయింది. ఉన్న కొద్దిపాటి మంచి కాలేజీల్లో ఫీజులు లక్షల్లో ఉన్నాయి. చదివేదేదో మంచి కాలేజీలో చదివేతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా! అన్న ఉద్దేశంతో చాలామంది టాప్ కాలేజీల్లో చేరుతున్నారు. ఈ బలహీనతను అడ్డం పెట్టుకుని టాప్ కాలేజీలుగా చెప్పుకుంటున్న కొన్ని కాలేజీలు అడ్డగోలు ఫీజులను వసూలు చేస్తున్నాయి.