ఇంటర్ పరీక్షలు: హాల్టికెట్లు ఇవ్వని ‘శ్రీవాసవి’, క్రిమినల్ కేసుకు కడియం ఆదేశం
వనస్థలిపురంలోని పనామా సెంటర్ వద్ద ఉన్న శ్రీవాసవి కళాశాల ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనను కొనసాగించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు బుధవారం మధ్యాహ్నం 12గంటల నుంచి పరీక్షలు ప్రారంభమ
హైదరాబాద్: వనస్థలిపురంలోని పనామా సెంటర్ వద్ద ఉన్న శ్రీవాసవి కళాశాల ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనను కొనసాగించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు బుధవారం మధ్యాహ్నం 12గంటల నుంచి పరీక్షలు ప్రారంభమైనా.. ఇప్పటికీ హాల్టిక్కెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
224 మంది విద్యార్థులను కళాశాల యాజమాన్యం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించి తమ విద్యా సంవత్సరం వృథా కాకుండా హాల్టిక్కెట్లు వచ్చేటట్లు చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
తామంతా కూలీ పనులకు వెళ్లి తమ బిడ్డలకు ఫీజులు చెల్లిస్తే కళాశాల యాజమాన్యం దారుణంగా మోసం చేసిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం బంగారం తాకట్టు పెట్టి చదివిస్తున్నామని.. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తాము ఏడాదంతా కష్టపడి చదివితే కళాశాల యాజమాన్యం చేసిన తప్పుకు తమను బలి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను శ్రీవాసవీ కళాశాల యాజమాన్యం వమ్ము చేసిందంటూ కంటతడి పెట్టుకున్నారు. కాగా, విద్యార్థుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మద్దతు పలికారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ కళాశాల కొనసాగుతోందని మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులను మోసం చేసింది: ఇంటర్ బోర్డు
వనస్థలిపురంలోని శ్రీవాసవి కళాశాల బాగోతంపై ఇంటర్బోర్డు అధికారులు స్పందించారు. శ్రీవాసవి కళాశాల యాజమాన్యం బోర్డుకు ఫీజు చెల్లించలేదని.. వారు విద్యార్థులతో పాటు ఇంటర్ బోర్డును కూడా మోసగించారని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఆ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు విద్యా సంవత్సరం వృథా కాకుండా మేలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి అవకాశం ఇస్తామని.. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని సూచించారు.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం: కడియం
విద్యార్థులను మోసం చేసిన కళాశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. సదరు కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్పై క్రిమినల్ చర్యలకు ఆదేశించామని ఆయన తెలిపారు. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
ఎంసెట్ పరీక్షకు కూడా అవకాశం కల్పిస్తామని కడియం చెప్పారు. ప్రాక్టికల్, ఎన్విరాన్ మెంట్ ఎథిక్స్, ఉమెన్ వాల్యూస్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అనుమతి ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులను చేర్పించాలని ఆయన సూచించారు.