ఎర్రబెల్లి నట్టేట ముంచి పారిపోయాడు: సీతక్క, 'టిఆర్ఎస్ ఒత్తిడి తట్టుకుంటా'
వరంగల్/హైదరాబాద్: ఎర్రబెల్లి దయాకర రావు తెలుగుదేశం పార్టీని నట్టేట ముంచి పారిపోయారని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకురాలు సీతక్క గురువారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి వందమంది ఎర్రబెల్లిలు వెళ్లిపోయినా ఎలాంటి నష్టం లేదని చెప్పారు.
Cartoon : TTDP leaders join TRS
ఎర్రబెల్లి టిఆర్ఎస్లో చేరడం ద్వారా ఆయన కోవర్టు అన్నది నిజమని తేలిపోయిందన్నారు. ఎర్రబెల్లి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశారన్నారు. కాగా, తనకు తెరాస నుంచి ఎలాంటి పిలుపు రాలేదని, తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చెప్పారు.
టిడిపిని వదిలే ప్రసక్తి లేదు: మందాడి
తాను తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోను వీడేది లేదని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క కార్పోరేటర్ మందాడి శ్రీనివాస రావు అన్నారు. తాను ఎప్పటికీ టిడిపిలోనే ఉంటానని చెప్పారు. తన పైన ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఒకవేళ ఎవరైనా ఒత్తిడి తెచ్చినా తట్టుకొని పార్టీలో కొనసాగుతానన్నారు.
తెలంగాణ టిడిపి విస్తృతస్థాయి సమావేశం
మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు అత్యవసరంగా భేటీ కానున్నారు. తెలంగాణ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ, ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి, ఇంచార్జీలు సమావేశం కానున్నారు. ఇటీవల పార్టీ నుంచి తెరాసలోకి వెళ్తున్న వలసల పైన చర్చించనున్నారు.