సైకో రాములు..18 మంది మహిళలను చంపిన ఘాతకుడు..చిన్న చీటీ ముక్కతో వెలుగులోకి హత్యలు...
ఒకటి కాదు,రెండు కాదు... ఏకంగా 18 మంది మహిళలను అతి దారుణంగా హతమార్చిన సైకో కిల్లర్ను హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ హత్య కేసులో దొరికిన ఒకే ఒక్క చిన్న క్లూ ఆధారంగా సైకో హత్యల వ్యవహారం మొత్తం బయటపడింది. కల్లు కాంపౌండ్లు,మద్యం దుకాణాలు,బహిరంగ ప్రదేశాల్లో ఒంటరి మహిళలే టార్గెట్గా ఇప్పటివరకూ 18 మంది మహిళలను అతను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే డబ్బు కోసం వీరిని హత్య చేశాడా.. లేక ఉన్మాద మనస్తత్వంతో హత్యలకు పాల్పడ్డాడా అన్నది తేలాల్సి ఉంది.
ఆ చీటీ ముక్కతోనే వెలుగులోకి...
ఈ నెల మొదటివారంలో హైదరాబాద్ శివారులోని అంకుషాపూర్ సమీపంలో మొదట ఓ మహిళ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ముఖం గుర్తుపట్టరాకుండా ఉండటంతో ఆమెకు సంబంధించిన వివరాలేవీ తెలియరాలేదు. అయితే సంఘటనా స్థలంలో దొరికిన ఒకే ఒక్క చిన్న క్లూతో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. మృతురాలి చీర కొంగుకు ఉన్న ముడిలో చిన్న చీటి ముక్క దొరికింది. అందులో ఒక సెల్ఫోన్ నంబర్ రాసి ఉంది. ఇక ఆ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగా... అది నేరెడ్మెట్గా చెందిన వ్యక్తిదిగా తేలింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె జూబ్లీహిల్స్ సమీపంలోని వెంకటగిరికి చెందిన వెంకటమ్మ(50)గా పోలీసులకు చెప్పాడు. హత్యతో అతనికి ఎలాంటి సంబంధం లేదని తెలిసి పోలీసులు అతన్ని విడిచిపెట్టారు.
ఆ ఫోటో ఆధారంగా....
కేసు విషయమై రాచకొండ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా... ఈ నెల 1న వెంకటమ్మపై మిస్సింగ్ కేసు నమోదైంది. ఆమె సెల్ఫోన్ నంబర్ ఆధారంగా చివరిసారిగా బేగంపేటలో ఆమె ఫోన్ సిగ్నల్ నమోదైనట్లు గుర్తించారు. నగరంలోని పలుచోట్ల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. చివరకు ఒకచోట వెంకటమ్మ,మరో వ్యక్తితో కలిసి ఆటోలో బయలుదేరిన దృశ్యాలను గుర్తించారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. కుటుంబ సభ్యులు,తెలిసినవారికి అతని ఫోటోను చూపించగా... అతనెవరో తెలియదన్నారు.
ఎట్టకేలకు పట్టుబడ్డ సైకో రాములు...
ఆ ఫోటో పట్టుకుని నగరమంతా విస్తృతంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతని ఆచూకీ కనుగొన్నారు. నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తి గతంలో అతన్ని బోరబండలో చూసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టిన పోలీసులు... ఎట్టేకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సైకో రాములుగా గుర్తించారు.
వెంకటమ్మను తానే హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు... మరికొంతమందిని కూడా ఇలాగే హత్య చేసినట్లు చెప్పాడు. మొత్తంగా 18 మంది మహిళలను అతను హత్య చేసి ఉంటాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గతంలో రాములుపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవగా... మానసికస్థితి సరిగా లేకపోవడంతో పోలీసులు ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి తప్పించుకు పారిపోయిన రాములు ఎట్టకేలకు మళ్లీ పట్టుబడ్డాడు.