వరంగల్ సెంట్రల్ జైలుకు శ్రీనివాస రెడ్డి .. 14 రోజుల రిమాండ్ .. నేడు కస్టడీ పిటీషన్ వేసే అవకాశం
హజీపూర్ లో బాలికల జీవితాలను ఛిద్రం చేసిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని వరంగల్ సెంట్రల్ జైలు కు తరలించారు. హజీపూర్ లో ముగ్గురు బాలికల హత్య కేసులో కీలక నిందితుడు, మర్రి శ్రీనివాస్ రెడ్డిని భువనగిరి మున్సిఫ్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది కోర్టు.
ఆగష్టు 15 న పుట్టిన మానవ మృగం .. బాలికల జీవితాలు చిదిమేసిన శ్రీనివాసరెడ్డి
భువనగిరి కోర్టులో శ్రీనివాసరెడ్డిని హాజరు పరచిన పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో వెలుగుచూసిన సైకో శ్రీనివాసరెడ్డి ఉదంతం సంచలనం సృష్టించింది . శ్రావణి, మనీషా, కల్పన అనే ముగ్గురు బాలికలను శ్రీనివాస రెడ్డి పొట్టనబెట్టుకున్నాడు.వారిపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు విచారణలో అంగీకరించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం శ్రీనివాసరెడ్డిని పోలీసులు భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం శ్రీనివాసరెడ్డికి 14రోజుల రిమాండ్ విధించింది.
14రోజుల రిమాండ్ విధించిన కోర్టు .. వరంగల్ జైలుకు తరలింపు
రిమాండ్ అనంతరం నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు అనంతరం నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని వరంగల్ జైలుకు తరలించారు పోలీసులు. ఇదిలా ఉంటే పోలీసులు కస్టడీ పిటీషన్ వెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు .గురువారం మానవ మృగం శ్రీనివాస్ రెడ్డిని కస్టడీ కోరుతూ కస్టడీ పిటీషన్ వెయ్యనున్నారు పోలీసులు.
శ్రీనివాసరెడ్డిని ఉరి తియ్యాలని నేతల డిమాండ్
హాజీపూర్ సైకో కిల్లర్ విషయంలో జరిగిన దారుణ ఘటనలపై స్పందించిన రాజకీయ నాయకులు పలువురు నిందితుడిని ఎన్ కౌంటర్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. వీ.హెచ్ శ్రీనివాసరెడ్డిని ఎన్కౌంటర్ చెయ్యాలని డిమాండ్ చెయ్యగా, నిందితుడికి ఉరి శిక్ష వెయ్యాలని మరికొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు.