వర్ష బీభత్సానికి వణికిపోతున్న వరంగల్, జనజీవితం అతులాకుతలం
వరంగల్: వర్షం దెబ్బకు వరంగల్ విలవిలలాడుతోంది. జనజీవితం స్తంభించింది. పక్షిలా వణికిపోతోంది. గత నాలుగు రోజులుగా వరంగల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసాయి. శుక్రవారం ఒక్కరోజే 83.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం జిల్లాలో నమోదైంది. ఫలితంగా 5500 చెరువుల్లో నాలుగువేల చెరువులు అలుగు దుంకుతున్నాయి.
అమరావతినగర్లోని కేయూ ఎక్స్రోడ్స్ వద్ద రోడ్డుపై నీటి ప్రవాహం అధికంగా ఉంది. అమరావతినగర్లోని చాలా ఇళ్లు నీటమునిగాయి. కాలనీలన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సోమిడి చెరువు, వెంకటాపురం చెరువు తెగిపోవడంతో భారీ ఎత్తున వరద వస్తోంది.
వీడియో: వానలకు హైదరాబాద్ నగరం చెరువైంది
వడ్డేపల్లి చెరువు పూర్తిగా నిండి మత్తడి పోస్తోంది. దాదాపు 27 చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టుప్రాంతాలు నీటమునిగాయి. రహదారులన్నీ నదుల్లాగా కనిపించాయి. రోడ్లు కోతకు గురి కాగా, కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఒకరు మరణించారు. పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. గొర్రెలు, పశువులూ మృత్యువాత పడ్డాయి.జిల్లా యంత్రాంగం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. వరంగల్ మహానగరంలో 12 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 6వేల మందిని సురక్షితంగా కాపాడారు. వారికి ఆహార పొట్లాలు అందిస్తూ జిల్లా యంత్రాంగం, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు సహ సర్కారు సర్వ వ్యవస్థలు సేవలు చేస్తున్నాయి.
వర్షాలతో తల్లడిల్లిన గుంటూరు జిల్లా
వర్షాల కారణంగా నగరంలోని ప్రధాన రహదారులే కాకుండా ఇతర జిల్లాలకు వెళ్లే మార్గాలు జలదిగ్బంధంలో చిక్కిపోయాయి. దీంతో హైదరాబాద్-వరంగల్ మార్గంలో మధ్యా హ్నం దాకారాకపోకలు నిలిచిపోయాయి. 163 నెంబర్ జాతీయ రహదారి (ములుగు రోడ్లోని పెద్దమ్మగడ్డ ప్రాంతంలో) , హన్మకొండ-కరీంనగర్ మధ్యలో రాకపోకలు సాయంత్రం దాకా నిలిచిపోయాయి. ఇక కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది.
వర్షాల కారణంగా శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో శనివారం కూడా జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కాకతీయ యూనివర్సిటీ పరిధి సైతం సెలవు ప్రకటించడమే కాకుండా యూనివర్సిటీ పరిధిలో శనివారం జరిగే పరీక్షల్ని వాయిదా వేసింది.