ప్రామీసరి నోట్ చూసి పారిపోయిన ఎమ్మెల్యే..! నేను సంతకం పెట్టను పో అంటూ పరుగులు..!!
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులకు చిత్రవిచిత్ర అనుభవాలు ఎదురౌతున్నాయి. ప్రజల్లో వచ్చిన చైతన్యం ముందు ప్రజా ప్రతినిధులు అవాక్కవుతున్నారు. గత ఎన్నికల్లో హామీలను గుప్పించి వాటిని నెరవేర్చని ప్రజా ప్రతినిధులను నిర్మొహమాటంగా నిలదీస్తున్నారు ప్రజలు. ఇలాంటి సంఘటనే తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వెళ్లిన తెలంగాణ ఎమ్మెల్యేకి వినూత్న అనుభవం ఎదురైంది. ఓట్లు అడగడానికి వెళ్లిన టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి నాగిరెడ్డిపల్లి ప్రజలు షాకిచ్చారు. గ్రామంలో మూడు ప్రాధాన పనులు చేపడితే ఓట్లు వేస్తామంటూ గ్రామస్థులు హామీ పత్రం రూపొందించగా, ముందు సంతకం చేస్తానని చెప్పిన ముత్తిరెడ్డి ఆ తరువాత ముఖం చాటేశారు. సంతకం చేసేది లేదని అక్కడనుండి పరుగులు తీసారు.
నాగిరెడ్డి పల్లి గ్రామంలో చెరువు, నాగిరెడ్డిపల్లి -కొన్నెమధ్య బీటీ రోడ్డు నిర్మించాలని, మార్కెట్ యార్డు నిర్మాణానికి భూమి విరాళంగా అందచేయాలని తొలుత గ్రామస్థులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వివరించారు. ఆయన సరేనని అనడంతో ఈ నెల 20వ తేదీన బాండ్ పేపర్ పై హామీ పత్రం తయారు చేశారు. ఎన్నికలలో గెలిచిన మూడు నెలల వ్యవధిలో ఈ మూడు పనులను పూర్తి చేస్తానని రాశారు. గ్రామస్తుల సమక్షంలో ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ముందుగా ఒప్పుకున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆ తరువాత మనసు మార్చుకున్నారని, సంతకం చేయడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ బాండ్ పేపర్ సోషల్ మీడియాలో విస్త్రుత ప్రచారానికి గురౌతోంది.