ఆందోళనలో ప్రజలు: నిత్యావసర సరుకుల కొనుగోలుకూ చిల్లర లేదు...
హైదరాబాద్: ఐదు వందలు, వేయి నోట్ల రూపాయలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అకస్మాత్తుగా మంగళవారం రాత్రి ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రులు, పెట్రోల్ బంకుల వంటి వద్ద ఆ నోట్లను తీసుకుంటారని చెప్పినప్పటికీ అక్కడ కూడా వాటిని తీసుకోవడం లేదు. దాంతో ప్రజలు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు.
ప్రతి సాధారణమైన ఇంటిలో కనీసం లక్ష నుంచి రెండు లక్షల వరకు నగదు ఉండే అవకాశం ఉంది. అవి కూడా ఐదు వందలు లేదా వేయి రూపాయల నోట్ల రూపంలోనే వాటిని దాచే అవకాశం ఉంది. వాటిని ఎలా మార్చుకోవాలనే విషయంపై వారు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. పెళ్లిళ్లకు డబ్బులు క్యాష్ చేసుకున్న కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు.
సామాన్య ప్రజలు దాదాపుగా ఐదు వందల నోట్లు, వేయి రూపాయల నోట్లను పర్సుల్లోనూ జేబుల్లోనూ పెట్టుకుంటారు. అవి ఎక్కడా చెల్లడం లేదు. దాంతో దినసరి ఖర్చుల కోసం కూడా ఇబ్బందిగా మారింది. కూరగాయాలు, నిత్యావసర సరుకులు కూడా కొనుక్కోలేని స్థితి ఏర్పడింది. బస్సుల్లో కూడా ఐదు వందులు, వేయి రూపాయల నోట్లు తీసుకోవడం లేదు. తినడానికి తిండి లేక, టికెట్లు కొని ఇళ్లకు వెళ్లడానికి చిల్లర డబ్బులు సరిపోక ప్రయాణికులు బస్సు డిపోల్లో ఇబ్బందులు పడుతున్నారు.
చాలా మంది వద్ద వంద నోట్లు తక్కువగానూ వేయి, ఐదు వందల నోట్లు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఏ వస్తువునూ, సరుకునూ కొనుక్కోలేని స్థితిలో పడ్డారు. నెల ప్రారంభమై వారం రోజులే కావడంతో చాలా మంది ఇంటి ఖర్చులకు.. ఇతర అవసరాలకు నగదు డ్రా చేస్తారు. సాధారణంగా వారి వద్ద 500, 1000 నోట్లే ఉంటాయి. ఇలాంటి వారూ తిరిగి వాటిని మార్చుకొనేందుకు బ్యాంకులకు పరిగెత్తాల్సి ఉంటుంది. తక్షణ అవసరాలకు తమ వద్ద ఉన్న నగదు వారికి అక్కరకురాదు.
రాణా దుకాణాలు, చిన్న హోటళ్లు నిర్వహించే వారి వద్ద రోజువారీ ఆదాయాన్ని తమ వద్దే ఉంచుకొని నాలుగురోజులకోసారో.. వారానికోసారో బ్యాంకుల్లో జమ చేస్తుంటారు. అందులో నుంచే తమ వద్ద పనిచేసే వారికి రోజువారీగా చెల్లింపులు చేస్తుంటారు. వీరందరూ కొన్ని రోజులపాటు ఇబ్బందులు పడనున్నారు. కాంట్రాక్టర్లు సైతం రోజువారీ కూలీలకు చెల్లించేందుకు భారీగా పెద్ద నోట్లను తమ వద్ద ఉంచుకుంటారు. వీరూ ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
పిల్లలు విదేశాల్లో ఉంటూ ఒంటరిగా ఉంటున్న వృద్ధ తల్లిదండ్రులకు పెద్ద నోటు రద్దుతో ఇబ్బంది తప్పకపోవచ్చు. అత్యవసర ఖర్చుల కోసం వీరి తమ వద్ద పెద్ద నోట్లనే ఉంచుకుంటారు. తాజా నిర్ణయంతో.. అత్యవసర ఖర్చులకు ఉంచుకొన్న నగదు అక్కరకు రాని పరిస్థితి ఏర్పడుతుంది.
కిరాణా దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేయాలన్నా... క్యాబ్లో ప్రయాణించి డబ్బులు చెల్లించాలన్నా వీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. బుధవారం బ్యాంకులకు సెలవు కావడంతో వీరు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను తక్షణం మార్చుకొనే అవకాశమూ లేదు. ఆ తర్వాత కూడా చాంతాడంత క్యూలతో వృద్ధులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.