మూడ్రోజులు పూజలు: శబరిమల వివాదాలకు సికింద్రాబాద్ అయ్యప్ప గుడి వాస్తు కారణమా?
సికింద్రాబాద్/శబరిమల: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. శబరిమలలోకి పది నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలను కూడా అనుమతించాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై మహిళలు సహా భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వస్తున్నాయి.
ఇతర మతాల జోలికి వెళ్లని కోర్టులు, ప్రభుత్వాలు కేవలం హిందూమతం విషయంలోనే జోక్యం చేసుకుంటున్నాయని, ఇతర మతాల్లో కూడా అలా జోక్యం చేసుకుంటారా అని కూడా పలువురు నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే శబరిమల ఇష్యూకు సికింద్రాబాద్ మెట్టుగూడలోని అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
సికింద్రాబాద్ మెట్టుగూడ అయ్యప్ప ఆలయ ప్రభావం
సికింద్రాబాద్ సమీపంలోని మెట్టుగూడ ప్రాంతంలో అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలోని వాస్తు దోషం కారణంగానే శబరిమలలో ఇలా జరుగుతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. మెట్టుగూడ ఆలయంలోని వాస్తుదోషం శబరిమలలోని అయ్యప్ప ఆలయంపై ప్రతిబింబిస్తోందని అంటున్నారు. అయితే అదేం లేదని, అదంతా వట్టిదేనని ఆలయ కమిటీ కూడా ప్రకటించిందని చెబుతున్నారు. కానీ ఇటీవల మెట్టుగూడ అయ్యప్ప ఆలయంలో వాస్తుదోష పూజలు నిర్వహించారు.
Recommended Video
ఆలయంలో నాగమూర్తుల విగ్రహం ప్రతిష్టాపన
మెట్టుగూడలోని అయ్యప్ప ఆలయాన్ని దశాబ్దాల క్రితం నిర్మించారు. శబరిమల ప్రధాన అర్చకులు నీలకంఠ తంత్రి నేతృత్వంలో అయ్యప్ప విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. శబరిమల దేవాలయంలోని సంప్రదాయాలను ఈ ఆలయంలో పాటిస్తారు. అయితే ఈ ఆలయం నిర్మాణ సమయంలో నైరుతీ దిశలో ఉండాల్సిన నాగమూర్తుల విగ్రహాలను వాయువ్య దిశలో ప్రతిష్టించారు.
వాస్తుపూజలు, నాగమూర్తుల విగ్రహ పునఃప్రతిష్టాపన
మెట్టుగూడ అయ్యప్ప దేవాలయంలో వాస్తుదోషం ఉన్నట్లు శబరిమల ఆలయపూజారులు గుర్తించారు. దీంత ఇక్కడ వాస్తును సరిచేయాలని నిర్ణయించారు. ఇది అరిష్టమని భావించి దాదాపు తొమ్మిది నెలల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వాస్తు దోషాన్ని సరిచేసే పూజలు చేయాలని భావించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 26, 27, 28 తేదీలలో ప్రత్యేక వాస్తు పూజలు నిర్వహించారు. శుక్రవారం ప్రారంభమైన పూజలు ఆదివారం వరకు కొనసాగాయి. అనంతరం వాయువ్య దిశలో ఉన్న నాగమూర్తుల విగ్రహాలను నైరుతీ దిశలో ప్రతిష్టించారు. ఈ క్రతువు రూ.7లక్షల వ్యయంతో క్రతువు నిర్వహించారు.
ఈ ప్రచారంలో వాస్తవం లేదు
మెట్టుగూడ నాగమూర్తుల విగ్రహం సరైన దిశలో లేనందునే ప్రస్తుతం శబరిమలలో జరుగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు భావిస్తున్నారు. దీనిపై పూజారులు స్పందించారు. ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, ఎనిమిది నెలల క్రితమే తీసుకున్నామని, ఈ వాస్తు దోషం శబరిమల ఆలయంపై ప్రభావం పడిందనే వాదనలు సరికాదని చెబుతున్నారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
ఎప్పుడు గుర్తించారంటే?
ఈ వాస్తు దోషాన్ని మూడేళ్ల క్రితం గుర్తించారట. అంతకుముందు శబరిమల ఆలయ ప్రధాన పూజారి మేనల్లుడు కందారు రాజీవరు వచ్చిన సమయంలోనే ఈ దోషాన్ని గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. అప్పుడే దీనిని సరిచేయాలని నిర్ణయించారు. దేశంలో ఎక్కడ అయ్యప్ప ఆలయాలు నిర్మించాల్సి వచ్చినా శబరిమల ఆలయ పూజారుల సూచనలు తీసుకుంటారు. మెట్టుగూడ ఆలయాన్ని కూడా శబరిమల పూజారుల సూచనతోనే నిర్మించారు. వాస్తు దోషం తెలిశాక కూడా నష్టనివారణ చర్యలు చేపట్టలేదని, దీంతో అరిష్టాలు జరుగుతున్నాయని, ఆరేళ్లుగా కమిటీకి అధ్యక్షత వహించిన ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో అకాల మృతి చెందారని, తమ మాజీ ప్రధాన పూజారి కూడా క్యాన్సర్ బారినపడ్డారని, దీంతో పాటు కాలనీకి చెందిన పలువురు వివిధ రకాల రుగ్మతలతో బాధపడుతున్నారని ఆలయ ప్రధాన కార్యదర్శి నంబియార్ చెప్పారు.