వెరీ ఇంట్రెస్టింగ్: కోడలు సుహాసిని నియోజకవర్గంలో పురంధేశ్వరి ప్రచారం
హైదరాబాద్: కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున మాధవరం కాంతారావు ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
నందమూరి సుహాసినికి మరోసారి చేదు అనుభవం, అరెస్ట్ చేయాలని టీడీపీ డిమాండ్
ర్యాలీ, ప్రచారం
వసంత్ నగర్ నుంచి మూసాపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ రోడ్డు షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తన ప్రసంగంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితిలతో కూడిన మహాకూటమిపై విమర్శలు గుప్పించారు.
కేసీఆర్, కూటమిపై పురంధేశ్వరి విమర్శలు
కూకట్పల్లి నియోజకవర్గంలో చిన్నపాటి వర్షానికే పడవలు వేసుకొని వెళ్లవలసిన పరిస్థితులు ఉన్నాయని పురంధేశ్వరి విమర్శించారు. కాలువల నుంచి మురుగు నీరు ఇళ్లలోకి ప్రవహిస్తోందని చెప్పారు. నాలుగున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు. భావసారుప్యం లేని పార్టీలు అన్నీ ఏకమై ప్రజా కూటమిగా ఏర్పడ్డాయని ఎద్దేవా చేశారు.
సుహాసిని నియోజకవర్గంలో బీజేపీకి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం
కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ నుంచి మాధవరం కాంతారావు పోటీ చేస్తుండగా, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మాధవరం కృష్ణారావు బరిలో నిలిచారు. మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఆ పార్టీ తరఫున పురంధేశ్వరి సోదరుడు హరికృష్ణ కూతురు సుహాసిని బరిలో నిలిచారు. సుహాసిని పోటీ చేస్తున్న నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పురంధేశ్వరి ప్రచారం చేయడం ఆసక్తిని కలిగించింది.
ఇటీవల పురంధేశ్వరి ఏం చెప్పారంటే?
కాగా, ఇటీవల పురందేశ్వరి తన కోడలు, కూకట్పల్లి మహాకూటమి అభ్యర్థి సుహాసిని గురించి మాట్లాడారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న నందమూరి సుహాసినికి మీ సహకారం ఉంటుందా అని ఓ జర్నలిస్ట్ ఇటీవల అడిగారు. దానికి పురంధేశ్వరి నవ్వుతూ సమాధానం చెప్పారు. ఓ మేనత్తగా తన కోడలికి ఎప్పుడూ ఆశీర్వాదం ఉంటుందని, పార్టీ పరంగా తాము వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మేనకోడలికి నా దీవెనలు ఉంటాయని చెప్పారు.