హీరో అల్లు అర్జున్ కారవాన్ను ఢీకొట్టిన లారీ... షూటింగ్ నుంచి తిరిగొస్తుండగా ప్రమాదం...
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కార్వాన్ ప్రమాదానికి గురైంది. పుష్ప మూవీ షూటింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్ తిరిగొస్తుండగా.. ఖమ్మం సమీపంలోని సత్యనారయణపురం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కారవాన్ను వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టింది. ఆపై లారీ డ్రైవర్ ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేయడంతో... వెనకాల వచ్చిన మరో వాహనం దాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారవాన్లో అల్లు అర్జున్ లేరని చిత్ర యూనిట్ వెల్లడించింది. కొంతమంది మేకప్ టీమ్ అందులో ఉన్నట్లు తెలిపింది. అయితే వాళ్లెవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
ప్రమాదానికి గురైన కారవాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండడంతో.. స్థానికులు అక్కడికి పరిగెత్తుకొచ్చారు. ప్రమాదంలో కారవాన్ వెనుక భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై జనాన్ని క్లియర్ చేశారు.ప్రమాదంపై పోలీసులు చిత్ర యూనిట్ను ఆరా తీశారు. రంపచోడవరం అడవుల్లో పుష్ప సినిమా షూటింగ్ను ముగించుకుని వస్తుండగా ప్రమాదం జరిగినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ నుంచి ఏపీలోని రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్గా నటిస్తున్నారు. మొత్తం రెండు షెడ్యూల్స్లో సినిమా షూటింగ్ను పూర్తి చేశారు. అగస్టు 13న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇటీవల 'సలార్' చిత్ర యూనిట్ ప్రయాణిస్తున్న ఓ వాహనం కూడా రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీనగర్ కాలనీ వద్ద రాజీవ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. చిత్ర యూనిట్ ప్రయాణిస్తున్న వ్యాను యూటర్న్ తీసుకుంటున్న సమయంలో... అటుగా వచ్చిన లారీ వాహనాన్ని ఢీకొట్టింది.దీంతో వాహనం స్వల్పంగా దెబ్బతినగా... అందులో ఉన్న నలుగురు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాద అనంతరం వారిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం తిరిగి వారు బస చేస్తున్న సింగరేణి గెస్ట్ హౌస్కు వెళ్లిపోయారు. రామగుండం ఓపెన్ కాస్ట్ గనిలో ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్ర షూటింగ్ ముగించుకుని గెస్ట్ హౌస్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.