పుట్ట మధు అరెస్ట్ .. భీమవరంలో అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు, ఈటెలతో లింక్, ఉచ్చు బిగిసినట్టేనా !!
పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ నేత పుట్ట మధును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరంలో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు పెద్దపల్లికి తరలిస్తున్నారు. గత వారం రోజులుగా పుట్టమధు అజ్ఞాతంలో ఉన్నారు. అసలు పుట్టమధు ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు? ఆయన ఎక్కడ ఉన్నారు అనే అంశం తెలంగాణ రాష్ట్రంలో మరోమారు చర్చనీయాంశమైంది.
పుట్ట మధు చుట్టూ తిరుగుతున్న లాయర్ల హత్యకేసు .. రాజకీయ కుట్రనా? సీబీఐ విచారణకు పిటీషన్
ఈటెల వ్యవహారంతో అజ్ఞాతంలో పుట్ట మధు
మూడు నెలల క్రితం జరిగిన న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనపై విచారణ జరుగుతుందన్న చర్చకూడా ప్రధానంగా రాష్ట్రంలో సాగుతోంది. ఇదే సమయంలో ఈటెల రాజేందర్ కు సన్నిహితంగా ఉన్న పుట్టమధు,తాజాగా ఈటెల బర్తరఫ్ తో అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం.ఈటెల రాజేందర్ కు సన్నిహితంగా మెలిగి వ్యాపార లావాదేవీలు కొనసాగించిన పుట్ట మధ పైన కూడా సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్ళారని సమాచారం.
న్యాయవాదులు వామన్ రావ్ దంపతుల హత్య కేసులో పుట్ట మధుకు బిగుస్తున్న ఉచ్చు
తాజాగా న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుకు ఉచ్చు బిగిస్తున్నట్లుగా సమాచారం.పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ప్రస్తుతం రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యకేసులో పుట్టమధును పోలీసులు ఇప్పటికే విచారించారు. వామన్ రావు తండ్రి ఫిర్యాదుతో పోలీసులు మరోసారి ఆయనను ప్రశ్నించనున్నారు. అయితే పుట్ట మధు అజ్ఞాతంపై శుక్రవారం మాట్లాడిన ఆయన భార్య, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ, ఆయన ఎక్కడికీ వెళ్లలేదని, స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయని, అందుకే ఆయన ఫోన్ స్విచాఫ్ చేశారని తెలిపారు.
తన భర్త ఎక్కడికీ వెళ్ళలేదన్న పుట్ట మధు భార్య శైలజ
తన భర్త పై జరుగుతున్న ప్రచారం తప్పని ఆమె ఖండించారు. ప్రజాప్రతినిధులకు పర్సనల్ లైఫ్ కూడా ఉంటుందంటూ గుర్తు చేశారు.ఈటెల రాజేందర్ తో పుట్ట మధు సాన్నిహిత్యంపై మాట్లాడిన ఆమె ఈటెల రాజేందర్ పార్టీలో ఉండేవారు కాబట్టి అప్పట్లో ఆయనను కలిశామని పేర్కొన్నారు. తాము టిఆర్ఎస్ పార్టీతోనే ఉంటామని, తమని స్థాయికి తీసుకు వచ్చింది సీఎం కేసీఆర్ నే అని పుట్ట శైలజ స్పష్టం చేశారు. కావాలని తన భర్తపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అంతకు ముందు కొప్పుల ఈశ్వర్ ను కలిసిన పుట్ట శైలజ
అయితే వారం రోజులుగా తన భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదని సహాయం కోసం ఆమె మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసినట్టు సమాచారం. కరోనా లక్షణాలతో ఆయన ఇంట్లోనే ఉన్నారని శైలజ చెప్పినా, పుట్ట మధును భీమవరంలో పోలీసులు అరెస్ట్ చేయడం ట్విస్ట్. మొత్తానికి ఈటెల ఎపిసోడ్ తో అంతకు ముందే వామన్ రావు దంపతుల హత్యకేసులో ఆరోపణలు ఉన్న పుట్టా మధును టార్గెట్ చేస్తున్నారని పెద్దపల్లి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది .
ఈటెలతో పుట్ట మధుకు సాన్నిహిత్యం .. భీమవరంలో పుట్ట మధు అరెస్ట్
ఈటెల రాజేందర్ కు సంబంధించిన భూకబ్జాలు వ్యవహారం వెలుగులోకి రావడంతో పాటు, ఒకపక్క ఈటెల పై వేటు వేయడం, మరోపక్క న్యాయవాది వామన్ రావు హత్య కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి రావడంతో పుట్ట మధు ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఇదే సమయంలో వామనుడు దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడటం రాష్ట్ర పోలీసు శాఖలోని ఉన్నతాధికారి నుండి ఆయనకు ఫోన్ రావడంతో ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఆయనను భీమవరం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.