రేణుకా చౌదరికి పువ్వాడ సవాల్ .. ఒక్క దొంగ ఓటు నిరూపించినా రాజీనామా చేస్తా
లోక్ సభ ఎన్నికలు ముగిసినా లోక్ సభ ఎన్నికల పోలింగ్ పై తెలంగాణా ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం లోక్ సభ పరిధిలో పోలింగ్ రోజు అధికార పార్టీ నేతలు పిల్లలతో దొంగ ఓట్లు వేయించారని సీఈవో రజత్ కుమార్ కు రేణుకా చౌదరి ఫిర్యాదు చేశారు .ఖమ్మం లోక్ సభ సెగ్మెంట్లో ఖమ్మం స్థానిక ఎమ్మెల్యే వారి చుట్టాలను, స్టూడెంట్స్ ను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే ఈ ఆరోపణను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఖండించారు .
లోక్ సభ వార్ ....పిల్లలతో దొంగ ఓట్లు వేయించారని సిఈవో కు ఫిర్యాదు చేసిన రేణుకా చౌదరి
రేణుకా చౌదరిపై పువ్వాడ ఫైర్ .. ఓటమి భయంతో ఈసీకి ఫిర్యాదు చేసిందన్న పువ్వాడ
ఖమ్మం నగరంలోని వీడీఓస్ కాలనీలోని పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ రేణుకా చౌదరి ఆరోపణలను తిప్పికొట్టారు. పోలింగ్ అయిపోయిన ఇన్ని రోజుల తర్వాత రేణుకా చౌదరి ఫిర్యాదు చెయ్యటం ఓటమి భయంతోనే అని ఆయన పేర్కొన్నారు.
రేణుకా చౌదరి వల్ల ఖమ్మం జిల్లా ప్రజలకు ఎలాంటి మేలు లేదన్న పువ్వాడ
గత కొన్ని సంవత్సరాల నుండి రాజకీయాలు చేస్తున్నటువంటి రేణుకా చౌదరి వలన ఖమ్మం జిల్లా వాసులకు ఇప్పటి వారికి ఎలాంటి మేలైనా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేసినటువంటి రేణుకా చౌదరి అనవసరమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని, తాను మాట్లాడేది నిజమే అయితే చేసిన ఆరోపణలని అన్నింటిని కూడా ఆధారాలతో సహా నిరూపించాలని పువ్వాడ అజయ్ కుమార్ సవాల్ విసిరారు .
ఒక్క దొంగ ఓటు నిరూపించినా రాజీనామా చేస్తానని రేణుకా చౌదరికి పువ్వాడ సవాల్
పార్లమెంట్ సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుక ప్రజల కోసం ఎన్నడూ కూడా ఆలోచించలేదని, ఇక రేణుక పని తీరుతో విసిగిపోయిన ప్రజలు ఆమెకు తగిన బుద్ది చెప్పడానికి సిద్ధమయ్యారని ఆయన ఆన్నారు . అందుకే రేణుక చౌదరి ఓటమి భయం తో పిల్లలతో ఓట్లు వేయించామని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని అజయ్ కుమార్ ఆరోపించారు. రేణుక చేసినటువంటి ఆరోపణలని ఆధారాలతో సహా నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని పువ్వాడ అజయ్ కుమార్ బహిరంగంగా సవాల్ విసిరారు. ఒక్క దొంగ ఓటు చూపించినా సరే తాను రాజీనామాకు సిద్ధం అని రేణుకా చౌదరికి సవాల్ విసిరారు పువ్వాడ అజయ్ కుమార్ .