పీవీ చేయకున్నా రాజీవ్ చేసేవారు, ఆ పుస్తకం వస్తే మరో కోణం: చిద్దూ ఆసక్తికరం
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని పీవీ నర్సింహా రావును కాంగ్రెస్ పార్టీ అవమానించిందనే వాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్ బారు '1991: పీవీ నరసింహా రావు ఎలా చరిత్ర సృష్టించారు' అనే పుస్తకాన్ని రాశారు. దీంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది.
చిదంబరం
ఈ పుస్తకావిష్కరణ సమయంలో మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ బతికి ఉంటే ఆయన కూడా పీవీలాగా ఆర్థిక సంస్కరణలను అమలు చేసేవారన్నారు. పీవీ సంస్కరణల నాయకుడు కావచ్చునేమో కానీ ఆయన పార్టీని గొప్పగా నడిపించలేక పోయారన్నారు.
బాబ్రీ మసీదు తప్పిదం
1992లో బాబ్రీ మసీదు కూల్చివేతను నిలువరించలేకపోవడం పీవీ చేసిన ఘోర తప్పిదమన్నారు. ఈ సంఘటన సమయంలో పీవీ పని తీరును పుస్తకంగా వేసుంటే ఆయనలో మరో కోణం చూసేవారమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే పీవీలోని విషాదమన్నారు.
నేనూ ఆరంభించా
పీవీ నరసింహా రావు సర్కార్ కన్నా ముందు చంద్రశేఖర్ ప్రభుత్వం హయాంలోనే.. తాను ఆర్థిక మంత్రిగా సంస్కరణలకు బీజం వేశానని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా అన్నారు. చంద్రశేఖర్ ప్రభుత్వం హయాంలో ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వాన్ని గాడిన పెడుతున్న సమయంలో, కాంగ్రెస్ పార్టీ ఇది తమ ఉనికికే ప్రమాదమని భావించి నాటి ప్రభుత్వాన్ని కూల్చేసిందన్నారు.
పీవీకి అవమానం
కాగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన పీవీ మరణించినపుడు ఆయన పార్థివ దేహానికి కనీస మర్యాదలు దక్కనివ్వలేదని, తుది వీడ్కోలు కోసం ఢిల్లీలోని పార్టీ కార్యాలయ ఛాయలకు కూడా రానివ్వకుండా అడ్డుపడి కాంగ్రెస్ అవమానించిందని, ఈ ప్రతీకార ధోరణికి అసలు కారణం... పీవీ చేసిన ఏకైక నేరం... కాంగ్రెస్పై నెహ్రూ-గాంధీ కుటుంబ యాజమాన్య పెత్తనానికి చరమగీతం పాడటమేనని ఈ తాజా పుస్తకంలో పేర్కొన్నారు.
మన్మోహన్ సింగ్ గౌరవించినా..
పీవీకి ఏటా చిత్తశుద్ధితో నివాళులు అర్పించే ఏకైక కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగేనని ఆ పుస్తకంలో చెప్పారు. అయితే, మన్మోహన్ పదేళ్లు ప్రధానిగా ఉన్నా తనకు రాజకీయ భిక్ష పెట్టిన పీవీకి భారతరత్న మాత్రం ఇప్పించలేక పోయారన్నారు. కాంగ్రెస్ తిరిగి మళ్లీ నెహ్రూ-గాంధీ కుటుంబ యాజమాన్య సంస్థగా మారిపోయిందని చెప్పడానికి మన్మోహన్.. పీవీకి భారతరత్న ఇప్పించలేక పోవడమే నిదర్శనం అన్నారు.
భారతరత్నకు అర్హుడు
నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఆవల కాంగ్రెస్కు సమర్థ నాయకత్వం ఉందని నిరూపించిన పీవీ భారతరత్నకు అన్ని విధాలుగా అర్హుడని సంజయ్ బారు పేర్కొన్నారు. పీవీ నర్సింహారావు నంద్యాల ఎన్నికల్లో 89.5 శాతం ఓట్లతో విజయం సాధించడం కూడా చరిత్ర పుటల్లో, రికార్డు పుస్తకాల్లో శాశ్వతంగా నిలిచిపోయేదన్నారు. ఆయన కాలంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి జాతీయ రాజకీయ పార్టీగా పాత రూపును సంతరించుకుందన్నారు.