కాంగ్రెస్పై పీవీ తనయుడి ఆగ్రహం, అదే దారిలో నడిచా: చంద్రబాబు
కరీంనగర్: తన తండ్రి పీవీ నర్సింహా రావు పేరు చరిత్రలో లేకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆయన తనయుడు పీవీ రాజేశ్వర రావు మంగళవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కృషి చేసిన పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. పీవీ నర్సింహా రావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాకు పీవీ పేరు పెట్టాలన్నారు.
అన్యాయం సవరించే ప్రయత్నం చేశారు: కేసీఆర్
భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు 95వ జయంతి సందర్భంగా ఆయనను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సర్పంచ్ నుంచి దేశ ప్రధాని వరకు ఎదిగిన తెలంగాణ బిడ్డ పీవీ అన్నారు. దేశం గర్వించదగ్గ పౌరుడు అన్నారు.
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు పీవీ కృషి చేశారన్నారు. ఆర్థిక సంస్కరణలకు మార్గ నిర్దేశకుడిగా, మానవ వనరుల అభివృద్ధి కాముకుడిగా చరిత్రలో ఆయనకు సుస్థిరస్థానం ఉంటుందన్నారు. ఇక పీవీ జ్ఞానభూమిలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, పీవీ కుటుంబ సభ్యులు పీవీకి నివాళులర్పించారు.
పీవీ చూపిన దారిలో నడిచాను: చంద్రబాబు
మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు. నవ్యాంధ్రకు పెట్టుబడుల కోసం చైనాలో మూడవ రోజు పర్యటిస్తున్న ఆయన.. బుధవారం ఉదయం పీవీని స్మరించుకున్నారు.
పీవీ కూల్చివేత యత్నాలు జరిగాయి: హాఫ్ లయన్లో సంచలనం
భారత దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది పీవీనే అన్నారు. ఆయన మార్గంలోనే తాను కూడా పయనించానని చెప్పారు. పీవీ ఆర్థిక సంస్కరణలను తాను రాష్ట్రంలో కొనసాగించానన్నారు. అప్పటివరకూ అమలవుతున్న లైసెన్స్ కోటా రాజ్ విధానానికి పీవీ చరమగీతం పాడారని కొనియాడారు.
సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి, పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ను మార్చిన ఘనత పీవీదే అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పీవీ స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నామని, ఈ విషయంలో బీజేపీతో చర్చిస్తామని చెప్పారు.