ప్రధానితో నేడు కేసీఆర్ భేటీ: ఏపీ భవన్తోపాటు కీలక అంశాలపై చర్చ
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. కొత్త జోనల్ విధానం, పంటలకు మద్దతు ధర, ముస్లింల, ఎస్టీల రిజర్వేషన్ల పెంపు, హైకోర్టు విభజన, ఢిల్లీలోని ఏపీభవన్ తెలంగాణకు కేటాయింపు తదితర కీలక ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ప్రధానితో భేటీ నిమిత్తం గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయల్దేరి దిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎంపీలు కేశవరావు, జితేందర్రెడ్డి, సంతోష్కుమార్, బండా ప్రకాశ్ తదితరులున్నారు.
ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఆయన టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమై ప్రధాని దృష్టికి తీసుకెళ్లాల్సిన 68 అంశాలపై చర్చించారు. జోనల్ విధానం, రిజర్వేషన్ల బిల్లుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపినందున వాటిని ఆమోదించాలని ప్రధానిని కేసీఆర్ కోరనున్నారు. వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానం చేయడం, హైకోర్టు విభజనకు సత్వర చర్యలు, ప్రాజెక్టులకు సహకారం, పన్నుల వాటా పెంపు, ఎయిమ్స్, గిరిజన విశ్వవిద్యాలయాలకు నిధులు ఇతర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.
అంతేగాక, న్యూఢిల్లీలోని ఏపీభవన్ నిజాంకు చెందినది అయినందున దానిపై పూర్తి అధికారం తెలంగాణకే ఇవ్వాలని కోరనున్నారు. శుక్రవారం ప్రధానితో సమావేశం అనంతరం కేసీఆర్ ఢిల్లీలోనే ఉండి, జూన్ 17న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు.