తెలుగుదేశంలోనే ఉన్నా, నాకు తెలియదు: బాబుతో భేటీపై ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని బీసీ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య సోమవారం అన్నారు. ఆయన అబిడ్స్లో బీసీ కుల సంఘ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాజకీయ పార్టీలు బీసీలకు జనాభా ప్రాతిపదికన టిక్కెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
Recommended Video
ఈసారి రాజకీయ పార్టీలుబీసీలను విస్మరిస్తే భౌతికదాడులు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తు గురించి ప్రశ్నించగా.. దాని గురించి తాను మాట్లాడనని స్పష్టం చేశారు. తాను మాత్రం తెలుగుదేశంలోనే ఉన్నానని తెలిపారు. పార్టీకి రాజీనామా చేయలేదన్నారు.
నేను గిన్నెలు శుభ్రం చేస్తా: కేటీఆర్కు మద్దతుగా ఫోటోలు పెడుతూ నెటిజన్ల ఆగ్రహం
తెలంగాణ టీడీపీ ముఖ్య నేతల సమావేశం గురించి తెలియదు
రెండు రోజుల క్రితం ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఆర్ కృష్ణయ్య హాజరు కాలేదు. దీనిపై ప్రశ్నించగా... తెలంగాణ టీడీపీ ముఖ్య నేతల సమావేశం గురించి తనకు సమాచారం లేదని చెప్పారు.
ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలని ఒత్తిడి
వచ్చే ఎన్నికల్లో తాను మళ్లీ ఎల్బీ నగర్ నుంచే పోటీ చేసే అవకాశంపై ఆర్ కృష్ణయ్య స్పందించారు. అక్కడి నుంచి పోటీ చేయాలని ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్నారు.
ఇక బీసీలనే గెలిపించుకుంటాం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 65 సీట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల్లో బీసీ కులాల కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. ఇక రాజకీయాలకు అతీతంగా ఈసారి బీసీ అభ్యర్ధులనే గెలిపించుకుంటామని ఆయన తెలిపారు. పార్టీ పెట్టే విషమయై కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు.
తెలంగాణ అంశాలపై చర్చ
ఆయన సిద్ధార్థ హోటల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన 112 బీసీ కులాలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ కులాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళిక, అత్యధిక సీట్లు కేటాయించే రాజకీయ పార్టీలకు పూర్తిగా మద్ధతు ఇవ్వడం, బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడం వంటి అంశాలపై చర్చించారు.