దీక్ష చేస్తే రిజర్వేషన్లు ఇవ్వాలా, రైళ్లు తగలబెడితే చర్చలా: బాబుపై ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: దీక్షలు చేసిన వారికల్లా రిజర్వేషన్లు ఇస్తే ఊరుకునేది లేదని బీసీ సంఘం నేత, ఎల్బీ నగర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం నాడు హెచ్చరించారు.
ఏ కులాన్ని అయినా అయినా బీసీలలో చేర్చాలంటే దానికి శాస్త్రీయత కావాలన్నారు. దీక్షలు చేసిన వారికి రిజర్వేషన్లు ఇస్తే ఊరుకునేది లేదన్నారు. ఏపీలో కాపులకు రిజర్వేషన్లు అవసరం లేదని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.
అధికారం ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. పేదవారికి విద్య కావాలని, విద్య ద్వారా ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగాల నుంచి అధికారం పొందాలన్నారు. అధికారం ఉంటేనే పేదవారిని గుర్తిస్తారన్నారు. కాపులు రైళ్లు తగలబెడుతున్నారని ప్రభుత్వం చర్చలకు ముందుకు రావడం విడ్డూరమన్నారు.
తాము శాంతియుతంగా నిరసనలు చేస్తున్నామని తమను పట్టించుకోవడం లేదా, తాము శాంతిగా ఉంటే చర్చలకు రారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అనంతపురం జిల్లాల్లో బీసీ సభలు పెట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామన్నారు.