తెలంగాణకు తీరని లోటు: కేసీఆర్ ఆపద్బంధువు విద్యాసాగర్ రావు కన్నుమూత
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్ రావు(77) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని నగరంలోని ఆయన గృహానికి తరలించారు.
అన్నా! నేనొచ్చిన: విద్యాసాగర్ రావుకు కేసీఆర్ పరామర్శ
నల్గొండ జిల్లా జాజిరెడ్డిగూడెంలో జన్మించిన విద్యాసాగర్ రావు నీటిపారుదల రంగంలో అపార అనుభవం గడించారు. కేంద్ర జలసంఘంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. సాగునీటి రంగంపై పలు పుస్తకాలు రచించారు. కాగా, నాలుగు రోజుల క్రితమే కేసీఆర్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యాసాగర్ రావును పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కేసీఆర్కు ఆప్తుడు
‘నీళ్లు-నిజాలు' పేరిట వ్యాసాలు కూడా రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యాసారగ్రావుని ప్రభుత్వం నీటిపారుదల శాఖ సలహాదారునిగా నియమించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు అత్యంత ఆప్తులలో ఒకరుగా ఉన్నారు విద్యాసాగర్ రావు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి పనిచేశారు.
కీలక పదవుల్లో..
అంతేగాక, కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు కూడా విద్యాసాగర్ రావు కీలక సూచనలు చేశారు. ఆయన సీడబ్ల్యూసీలో సభ్యునిగా, యూన్, వరల్డ్ బ్యాంక్ లలో సభ్యునిగా కూడా పనిచేశారు. ఈ సమయంలో ఆయన ప్రపంచ దేశాల్లో పర్యటించారు. అమెరికాలోని కొలరేడో యూనివర్సిటీలో వాటర్ రిసోర్స్ సిస్టమ్స్ ఇంజినీరింగ్లో డిప్లామో చేశారు.
పెద్దన్నను కోల్పోయా: కేసీఆర్
విద్యాసాగర్ రావు మరణ వినగానే సీఎం కేసీఆర్ విషాదంలో మునిగిపోయారు. తనకు పెద్దన్నగా ఉండే విద్యాసాగర్ రావు లోటు తనతోపాటు తెలంగాణకు తీరని లోటని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో విద్యాసాగర్ రావు కీలకంగా వ్యవహరించారని, ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడిందన్నారు. జయశంకర్ తర్వాత తెలంగాణ జాతిరత్నం విద్యాసాగర్ రావు అని చెప్పారు. కోటి ఎకరాలకు నీరు అందించాలన్న కల నెరవేరకుండానే ఆయన వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయాం
విద్యాసాగర్ రావు మృతికి మంత్రి హరీశ్ రావు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తెలంగాణ గొప్ప నీటి శాస్త్రవేత్తను కోల్పోయిందని అన్నారు. సీఎం కేసీఆర్కు విద్యాసాగర్ రావు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉండేవారని చెప్పారు. ఆంధ్రా పాలకుల వివక్షను విద్యాసాగర్ రావు తన పుస్తకంలో కళ్లకు కట్టారని హరీశ్ తెలిపారు.