అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి: హైదరాబాద్లోని పేరంట్స్ కన్నీరుమున్నీరు
హైదరాబాద్: అమెరికాలో జరిగిన ఓ కారు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13లో నివాసముంటున్న రాచమల్ల వినయ్ గౌడ్(24) నగరంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశాడు.
అనంతరం కొద్దికాలం పాటు సాప్ట్వేర్ ఇంజనీర్గా పని చేసిన అతడు గతేడాది డిసెంబర్ 31న కాలిఫోర్నియాలోని సిలికాన్వ్యాలీ యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన మరో ఆరుగురు విద్యార్ధులతో కలిసి కాలఫోర్నియాలో ఓ రూమ్లో ఉంటున్నాడు.
గత శుక్రవారం నలుగురు స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లాడు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో వీరందరూ తిరిగి వస్తుండగా కారుకు అడ్డంగా గుర్తు తెలియని వ్యక్తి రావడంతో కారు నడుపుతున్న వినయ్ గౌడ్ స్నేహితుడు సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కారు పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో వెనుక సీటులో కూర్చున్న వినయ్ అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో నలుగురు తీవ్ర గాయాలు పాలయ్యారు. వినయ్ గౌడ్ మరణించినట్టు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన అమెరికా అధికారులు మృతదేహాన్ని పంపుతున్నట్టు తెలిపారు.
వినయ్ గౌడ్ మృతదేహం శుక్రవారం ఉదయం నగరానికి రానున్నట్టు తెలిసింది. వినయ్ మరణంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన తమ కొడుకు శవమయ్యాడని తెలిసి తల్లిదండ్రులు కృష్ణగౌడ్, అనుపమ కన్నీరుమున్నీరవుతున్నారు.