నగరి గ్యాంగ్: కన్నేస్తే లూటీనే, రాచకొండ పోలీసులు పట్టేశారు
హైదరాబాద్ : చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ఓ ముఠా హైదరాబాద్ లో మకాం వేసి భారీ దోపిడీలకు పాల్పడుతోంది. నగరి గ్యాంగ్ గా పేరుబడ్డ ఈ ముఠాను సోమవారం నాడు సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు కోటి రూపాయల దాకా ఈ ముఠా చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నలుగురు నిందితుల నుంచి రూ.20లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగతా డబ్బుకు సంబంధించిన వివరాలను రాబడుతున్నారు.
గ్యాంగ్ మొత్తంలో 8నుంచి 10 మంది దాకా సభ్యులు ఉన్నారని, వీరి గ్యాంగ్ నగరి గ్యాంగ్ లేదా ఓజీ కుప్పం గ్యాంగ్ అనే పేర్లతో పాపులర్ అయిందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. చోరీల కోసం ఎక్కువగా బ్యాంకులను, రిజిస్ట్రేషన్ కార్యాలయాలనే టార్గెట్ చేసే ఈ ముఠా.. ముందుగా తమ ముఠాకు చెందిన మహిళలతో ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తుందని వెల్లడించారు.
ఈ గ్యాంగ్ ఇప్పటిదాకా చేసిన దోపిడీల్లో ఎక్కువ శాతం దోపిడీలు ఆయా వ్యక్తుల దృష్టి మరల్చి డబ్బు కాజేసిన సంఘటనలే అని మహేశ్ భగవత్ పేర్కొన్నారు. 2014 నుంచి యాక్టివ్ గా ఉన్న ఈ ముఠాపై ఒక్క రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 37 కేసులు నమోదు కావడం గమనార్హం. అలాగే సైబరాబాద్ పరిధిలో 7, హైదరాబాద్ పరిధిలో 14 కేసులు నమోదయ్యాయి.
తాజాగా ఈ ముఠా చేసిన చోరీలో.. ఓ వ్యక్తిని ఏకంగా 12కి.మీ వెంబడించి మరీ రూ.14లక్షలను అతడి నుంచి కాజేసింది. కుషాయిగూడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి మీర్ పేట్ లోని భూపేశ్ గుప్తా నగర్ దాకా అతన్ని ఫాలో అవుతూ వచ్చిన గ్యాంగ్.. అక్కడికి చేరుకోగానే అతడి చేతిలో ఉన్న రూ.14లక్షల బ్యాగ్ ను అందుకుని ఉడాయించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. గ్యాంగ్ లోని మిగతా సభ్యుల కోసం వేట కొనసాగుతోంది.