చిత్రహింసలు: యాదాద్రిలో బాలికల అక్రమ రవాణా, వ్యభిచార ముఠాల గుట్టురట్టు!
హైదరాబాద్: మానవ అక్రమ రవాణా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. కొంతమంది సహకారంతో ఈ అక్రమ రవాణా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. తాజాగా, యాదాద్రిలో వెలుగు చూసిన బాలికల అక్రమ రవాణా పోలీసులను, అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
వివరాల్లోకి వెళితే.. యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న కంసాని కల్యాణికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఇందులో అలేఖ్య ఆమె సొంత కూతురు. మౌనిక అనే చిన్నారిని ఏడాదిన్నర క్రితం కొనుగోలు చేసింది. తొలుత మౌనికను బాగానే చూసుకున్నా.. ఈ మధ్య కాలంలోనే అన్నంపెట్టకపోవడం, రోజూ కొట్టడం, తిట్టడంతో పాటు చిత్ర హింసలకు గురి చేస్తోంది.
రోజూ మౌనిక అరుపులు, కేకలు వినిపిస్తుండడంతో ఏమీ జరుగుతోందననే అనుమానంతో స్థానికులు చైల్డ్లైన్, ఐసీడీఎస్, షీటీం అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు సోమవారం ఆకస్మికంగా కల్యాణి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న చిన్నారి మౌనికను వివరాలు అడిగారు. తనను కల్యాణి రోజూ కొడుతుందని, అన్నం పెట్టడం లేదని, అలేఖ్యనే బా చూసుకుంటుందని వాపోయింది.
ఈ క్రమంలోనే కల్యాణిని అధికారులు లోతుగా విచారించగా.. మౌనిక తన కూతురు కాదని, ఏడాదిన్నర క్రితం యాదగిరిగుట్ట బస్టాండ్లో శంకర్ అనే వ్యక్తి అమ్మినట్లు చెప్పింది. తనతో పాటు పట్టణంలోని గణేష్నగర్కు చెందిన కంసాని సుధలక్ష్మి, శోభ, కంసాని కృష్ణ, కుమారి, మానసలకు కూడా చిన్నారులు అమ్మినట్లు తెలిపింది.
కాగా, గణేష్నగర్లోని వ్యభిచార గృహాల్లో ఉండే మహిళలకు ఏడాదిన్నర క్రితం శంకర్ అనే వ్యక్తి చిన్నారులను అమ్మినట్లు కల్యాణి చెప్పడంతో అధికారులు వెంటనే వారి ఇళ్లలో సోదాలు ప్రారంభించారు. పక్కనే ఉన్న ప్రజ్వల స్కూల్లో చదువుకుంటున్న ఆయా కుటుంబాల పిల్లలు సుమారు 10మందిపై అనుమా నం రావడంతో ఐసీడీఎస్, చైల్డ్లైన్, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కల్యాణి వద్ద హింసకు గురవుతున్న చిన్నారి మౌనికతో పాటు మరో నలుగురు చిన్నారులపై అధికారులు అనుమానం వ్యక్తం చేసి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు.
వీరిని పూర్తిగా విచారించి, స్థానికంగా ఉండే తల్లిదండ్రుల పిల్లలు అయితే వారికి అప్పజెబు తామని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి అమ్మినట్లు తెలిస్తే.. సీడబ్ల్యూసీ ఎదుట హా జరుపరిచి షెల్టర్ హోంకి తరలిస్తామన్నారు.
అయితే, ఐసీడీఎస్, చైల్డ్లైన్, పోలీసు అధికారులు కంసాని కల్యాణి ఇంట్లో సోదాలు చేస్తున్న విషయం తెలుసుకున్న.. గణేష్నగర్లోని పలు అక్రమ కుటుంబాలు ఇళ్లకు తాళం వేసి పారిపోయాయి. గణేష్నగర్లోని కంసాని సుధలక్ష్మీ, శోభ, కంసాని కృష్ణ, కుమారి, మానస ఇళ్లలోని ఒక రెండు ఇళ్లు మాత్రమే తెరచి ఉన్నాయి. మిగతా వారు ఎవరు లేకపోవడంతో పోలీసులు మరింత సమగ్రంగా విచారణ జరుపుతున్నారు.
ఇళ్లలో ఉన్న వారిని పోలీసులు, అధికారులు ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అగ్రహించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బీసీ కాలనీలో జరుగుతున్న విషయాన్ని ముందస్తుగానే గణేష్నగర్లో వ్యభిచారగృహాలలో ఉన్న వారికి ఎవరు సమాచారం ఇచ్చారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, చిన్నారులను యాదగిరిగుట్ట ప్రాంతానికి తీసుకువచ్చి అమ్ముతున్న వ్యక్తి స్థానికంగానే ఉండే శంకర్ అని కంసాని కల్యాణి అధికారుల విచారణలో తెలిపింది. శంకర్ చిన్నారులను ఇక్కడి ఏడాదిన్నర క్రితం తీసుకువచ్చి అమ్మిన తర్వాత మరణించాడని ఆమె వెల్లడించింది. కానీ.. శంకర్తో పాటు హైదరాబాద్లో ఉంటున్న ఇంకొందరు వ్య క్తులు అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేగాక, స్థానికంగానే ఉంటూ చిన్నారులతో పాటు అమ్మాయిలను కూడా అ క్రమ రవాణా చేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం పీడీ యాక్టు కేసులో జైలు జీవితం గడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. చిన్నారుల అక్రమ రవాణాకు కారకులు ఏవరు? శంకర్ మరణించిన తర్వాత ఈ వ్యాపారం ఎవరు నిర్వహిస్తున్నారు? స్థానికంగా ఉన్న కల్యాణి అనే మహిళ చెప్పిన విషయాలు నిజమేనా? అనే అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు.
కాగా, అదనపు, కొత్త చిన్నారులున్నట్లు తెలిస్తే ఐసీడీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఆ అధికారులు ఎక్కడా పరిశీలించిన దాఖలాలు లేవు. పిల్లలు ఉంటున్న పక్కనే అంగన్వాడీ కేంద్రం ఉంది. ఆ నిర్వాహకులు కూడా చూసీచూడనట్లు ఎందుకున్నారో తెలియాల్సి ఉంది. ఆ ప్రాంతంలో పోలీసులు రెండుసార్లు కట్టడిముట్టడి నిర్వహించారు. అయినా ఈ వివరాలు ఎక్కడా బయటికి రాలేదు. వారు ఏస్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించారో అర్థం అవుతోంది.
స్థానికులైన కొందరు నాయకులు సంప్రదాయ కుటుంబాల మధ్యలో ఉంటున్న వ్యభిచార గృహ నిర్వాహకురాలి ఇంటి నిర్మాణానికి సహకరించడంతోపాటు తరచూ రాకపోకలు సాగిస్తుండడంతో స్థానికులు నోరెత్తే సాహసం చేయలేకపోయారని తెలుస్తోంది. చిన్నారుల అక్రమ రవాణా, వ్యభిచార కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి.