ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అత్యుత్సాహమా: కెసిఆర్కు పొగ పెట్టడమా?
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భవిష్యత్తు వ్యూహాన్ని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ బద్దలు కొట్టడం సంచలనం రేపుతోంది. తెలంగాణ రాజకీయాల్లో అది కలకలం సృష్టించింది. తెరాస వర్గాలు రాధాకృష్ణపై తీవ్రంగా మండిపడుతున్నాయి.
సోషల్ మీడియాలో కెసిఆర్ అభిమానుల నుంచి, తెరాస కార్యకర్తల నుంచి ఆయన తీవ్రమైన విమర్శలను ఎదుర్కుంటున్నారు. సోషల్ మీడియా పోస్టులను గమనిస్తే కమ్మ సమాజిక వర్గం కూడా ఆయనపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు అర్థమవుతోంది.
కెసిఆర్ అనంతపురం పర్యటనను రాజకీయ వ్యూహం కోసం వాడుకున్నారని, కమ్మ - వెలమ సామాజిక వర్గం కూర్పు ద్వారా రెడ్డి సామాజిక వర్గాన్ని దెబ్బ తీయాలని అనుకుంటున్నారని ఆయన స్పష్టంగా రాశారు. అనంతపురం పర్యటనలో కెసిఆర్ వెంట ఆయన ఉన్నారు. అందువల్ల ఆయన రాతలకు విశ్వసనీయత కూడా చేకూరుతుంంది.
అత్యుత్సాహమా...
కెసిఆర్ భవిష్యత్తు వ్యూహం గుట్టును విప్పడంలో రాధాకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించారా అనే అనుమానం ఓ వైపు కలుగుగతోంది. ఆంధ్రజ్యోతి పత్రిక, టీవీ చానెల్ ఎండి కాక ముందు ఆయన జర్నలిస్టు కూడా. ఆంధ్రజ్యోతి వార్తాకథనాలను ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ప్రతి రోజూ కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. జర్నలిస్టులో ఉండే ఆసక్తి కారణంగా, అతి ముఖ్యమైన రాజకీయ పరిణామాన్ని ముందే చెప్పిన జర్నలిస్టుగా ప్రచారం పొందడానికి మాత్రమే ఆయన ఆ కాలమ్ రాశారా అనేది ప్రశ్న.
కెసిఆర్కు పొగపెట్టాలని చేశారా...
ఓ టీవీ చానెల్లో కెసిఆర్కు అత్యంత సన్నిహితులైన వి. ప్రకాష్, దేశపతి శ్రీనివాస్ రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై అప్పటికే దుమారం చెలరేగుతోంది. అది కెసిఆర్కు తలనొప్పిగా మారిందని కూడా అంటారు. దాని నుంచి బయటపడకముందే రాధాకృష్ణ కమ్మ, వెలమ కాంబినేషన్, జలగం ఫార్ములా అంటూ తెలంగాణ ప్రజానీకం ముందు పెట్టడం వెనక కెసిఆర్కు పొగపెట్టాలనే ఆలోచన కూడా దాగి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. నిజానికి, కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం తెలంగాణేతర తెలుగువారికి ఇష్టం లేదనేది బహిరంగ రహస్యమే. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక చాలా తెలివిగా వ్యవహరిస్తూ వచ్చింది. అదే చాతుర్యాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తోందా అనేది కూడా ప్రశ్న. అందుకే తెరాస వర్గాలు ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నాయని అంటున్నారు.
కెసిఆర్ దగ్గరయ్యారు....
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తాను అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కెసిఆర్ ఆంధ్ర మీడియాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. చాలా వరకు విజయం సాధించారు కూడా. రామోజీ రావుతో ఆయనకు నెయ్యం కుదిరింది. రాధాకృష్ణతోనూ ఆయనకు స్నేహం కుదిరింది. ఆంధ్రజ్యోతి కార్యాలయంలో మంటలు రేగినప్పుడు కెసిఆర్ స్వయంగా వెళ్లి చూసి వచ్చారు. అది తెలంగాణకు చెందిన చాలా మంది నచ్చలేదు. ఆ విషయం రాధాకృష్ణకు తెలియంది కాదు. కమ్మ, వెలమ కాంబినేషన్ అంటే తెలంగాణలో తీవ్రమైన వ్యతిరేకత పొడసూపే ప్రమాదం ఉంది.
వ్యూహాన్ని కెసిఆర్ చెప్పి అనుసరిస్తారా...
తన వ్యూహాన్ని కెసిఆర్ అందరికీ తెలిసేలా అమలు చేస్తారా అంటే, కాదనే చెప్పాలి. నిజానికి, తెలంగాణలో కుల రాజకీయాలు, కుల సమీకరణాలు చాలా తక్కువ. అందువల్ల మరో కారణం చెప్పి, మరో రకంగా ఎవరికీ అర్థం కాని పద్ధతిలో కెసిఆర్ ఆ వ్యూహాన్ని అమలు చేసి ఉండేవారు కావచ్చు. కానీ, రాధాకృష్ణ దాన్ని బయటపెట్టడం వల్ల మొదటికే మోసం వచ్చింది. ఇదే తెరాస వర్గాల ఆగ్రహానికి కారణమై ఉంటుందని అనుకోవచ్చు.