రాహుల్ రెండు రోజుల పర్యటన.. ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది..?
Recommended Video
తెలంగాణలో ఏఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ రెండు రోజుల పర్యటన బంపర్ హిట్టయ్యింది. రాటుదేలిన ప్రసంగాలు, కాంగ్రెస్ సీనియర్లతో చర్చల సందర్బంగా రాహుల్ చూపించిన పరిణతి, ప్రధాని మోదీ పైన విమర్శలు, తెలంగాణ ముఖ్యమంత్రి పై చేసిన ఆరోపణలు అన్ని సహజత్వంతో కూడుకున్న విదంగా ఎత్తి చూపారు. దీంతో రాహుల్ మునుపటి కన్నా ఇప్పుడు మెచ్యూరిటీగా వ్యవహరించారనే చర్చ పార్టీలో జరుగుతోంది.
అంతే కాకుండా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. ఒక ప్రణాళికా బద్ధంగా రాహుల్ గాంధీ పర్యటన సాగింది. నిరుద్యోగ యువత,మహిళలు, మైనారిటీలు, రైతులు ఇతర అన్ని రంగాల వారిని ఆకట్టుకోవడానికి రాహుల్ చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాన్నిచ్చాయి. సరూర్ నగర్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం నిరుద్యోగ గర్జన సభతో అయన పర్యటన ముగిసింది.
రాహుల్ పర్యటన సూపర్ హిట్..! జోష్ లో టీ కాంగ్రెస్..!!
రెండు రోజుల పాటు జరిగిన రాహుల్ గాందీ పర్యటనలో అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టు జరిగాయి. ముందుగా నిర్ధేశించిన షెడ్యూల్ ప్రకారం పక్కా ప్రణాళికతో కార్యక్రమాలు జరపడంలో పిసీసీ విజయం సాధించింది. పత్రికా సంపాదకులు, మీడియాకు చెందిన సీనియర్ ప్రతినిధులతో హరితప్లాజా లో సమావేశం జరిపారు. అలాగే తాజ్ కృష్ణ హోటల్ లో పారిశ్రామికవేత్తలతోనూ అయన సమావేశమయ్యారు. రెండు రోజుల పర్యటనలో శంషాబాద్ దగ్గర మహిళా ప్రతినిధులతో సమావేశంలో పాల్గొన్నారు. శేర్లింగంపల్లిలో బహిరంగసభలో ప్రసంగించారు. అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. సరూర్నగర్ నిరుద్యోగ గర్జన సభ నిర్వహణ బాధ్యతలు రేవంత్రెడ్డికి అప్పగించడం, ఆ సభలో రేవంత్ క్రేజ్ ను రాహుల్ గాంధీ స్వయంగా చూశారు.
గులాబీ వనంలో కలవరం..! బాస్ తీరుపై నేతల ఆశ్చర్యం..!
రాహుల్ గాంధీ పర్యటన సమయంలోనే కేసీఆర్ చేసిన హడావిడి టిఆర్ ఎస్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. హుటాహుటిన పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి సెప్టెంబర్ 2 న బహిరంగ సభ, అదే నెలలో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామనంటూ టిఆర్ఎస్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు, ఆయా కార్యక్రమాలకు ఉన్న వ్యవధి, వాటి సాధ్యాసాధ్యాలపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాహుల్ గాంధీ పర్యటనతో కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే తెలంగాణ ప్రజలు కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి అంత త్వరగా విముక్తి అవుతారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులతో రాహుల్ గాంధీ విడివిడిగా మాట్లాడడం ద్వారా కొత్త సంప్రదాయానికి తెరలేపారు.
పకడ్బందీ ప్రణాళిక..! పక్కా గా అమలు చేసిన టీ పీసిసి..!!
ఇక రాహుల్ తో భేటీకి 30 మంది నేతలకు మాత్రమే అవకాశం కల్పించారు. ఒక్కో టేబుల్ వద్దకు వెళ్లి నాయకులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్ట్ పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టాలి? టిఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా ఎలా తీసుకు వెళ్ళాలి? కాంగ్రెస్ నుంచి ఇంకా ఎవరైనా టిఆర్ ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులను కేసీఆర్ ఏ రకంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు? 2014 లో తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన కాంగ్రెస్ కు ప్రజలు ఓటు వేయకపోవడానికి కారాణాలేంటి? కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? ఏయే వర్గాలలో టిఆర్ ఎస్ పట్ల సానుకూల వాతావరణం ఉంది? వంటి అనేక అంశాలపై కాంగ్రెస్ నాయకుల నుంచి సమాచారం రాబట్టేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారు.
పరిణతి చెందిన రాహుల్..! ఆకట్టుకున్న ప్రసంగాలు..!!
సరూర్ నగర్ విద్యార్థి గర్జన సభలో రాహుల్ గాంధీ ప్రసంగంలో పదును పెంచారు. ప్రధాని మోదీని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రీ-డిజైనర్టుగా అభివర్ణించారు. తెలంగాణలో ప్రాజెక్టుల రీ-డిజైన్ ల పైరుతో లక్షకోట్లకు ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రధాని తన మిత్రుడు ముఖేష్ అంబాని కి ప్రయోజనం చేకూర్చిపెట్టేందుకే రాఫెల్ కొనుగోళ్లకు తావిచ్చారని ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యాడని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి రాగానే గబ్బర్ సింగ్ టాక్స్ నుండి చిరువ్యాపారులకు విముక్తి కలిగిస్తానని పేర్కొన్నారు. మహిళల సర్వతోముఖాభివ్రుద్దికి ఒక్క కాంగ్రెస్ పార్టీ మిత్రమే క్రుషి చేసిందని చెప్పుకొచ్చారు. చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళ, వ్రుద్దులకు చేయూత అందిస్తామని తెలిపారు. మొత్తానికి సరూర్ నగర్ సభలో అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా రాహుల్ ప్రసంగం కొనసాగింది. దీంతో పార్టీ క్యాడర్ లో నయా జోష్ వచ్చినట్టు తెలుస్తోంది.