సీడబ్ల్యూసీలో ‘తెలుగు’ లేదు: ఏపీ, టీ నేతలకు షాకిచ్చిన రాహుల్, వీహెచ్ తొలిసారి ఫైర్
న్యూఢిల్లీ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలకు షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే అత్యున్నత విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) మంగళవారం ఏర్పాటైంది. ఇందులో 23మంది సభ్యులు, 18మంది శాశ్వత ఆహ్వానితులు, 9మంది ప్రత్యేక ఆహ్వానితులకు చోటు కల్పించారు.
కొత్త సీడబ్ల్యూసీ తొలి సమావేశాన్ని జులై 22న నిర్వహించాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు. అంత బాగానే ఉంది కానీ, తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కమిటీలో ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సీనియర్ నేతలకు మొండిచేయి
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దక్షిణాదిలో కాంగ్రెస్కు ఎంతో కీలకమైన తెలంగాణ నుంచి ఒకరిని సీడబ్ల్యూసీలోకి తీసుకుంటారన్న ప్రచారం జోరుగా జరిగింది. ముఖ్యంగా పార్టీ సీనియర్ నేత జైపాల్రెడ్డికి తప్పక చోటు కల్పిస్తారనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ, ఆయనకు స్థానం కల్పించకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎల్పీ నేత జానారెడ్డిని లేదా సీనియర్ నేత వీ హనుమంతరావును సీడబ్ల్యూసీలోకి తీసుకుంటారన్న ప్రచారమూ జరిగింది. కానీ, అది కూడా జరగలేదు.
ప్రత్యేక ఆహ్వానితులు ఒక్కరే..
ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్ష హోదాకు సీడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానం ఉంది. ప్రస్తుతం ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన సంజీవరెడ్డి ఉన్నారు. ఆయన గత సీడబ్ల్యూసీలోనూ ఆ హోదాలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారని, అది ఆ పదవికి ఇచ్చిన గుర్తింపేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మేం కనిపించడం లేదా?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఏ ఒక్కరినీ సీడబ్ల్యూసీలోకి తీసుకోకపోవడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, తనలాంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కనిపించలేదా? అని నేరుగా ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఒక్కరికీ కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎంతో విధేయుడిగా ఉండే వీహెచ్ తొలిసారి విమర్శలు చేయడం గమనార్హం. కాగా, ‘ప్రస్తుతం మేం టీఆర్ఎస్ తో పోరాడుతున్నాం. ఈ దశలో ఉత్సాహాన్నిచ్చేలా సీడబ్ల్యూసీలో చోటు కల్పించాల్సిన అధిష్ఠానం ఒక్కరిని కూడా తీసుకోలేదు' అంటూ మరో నేత వ్యాఖ్యానించారు. ఏపీ నేతలు కూడా ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సీడబ్ల్యూసీ సభ్యులు వీరే
1.రాహుల్ గాంధీ 2. సోనియా గాంధీ 3. మన్మోహన్ సింగ్ 4.మోతీలాల్ వోరా 5.గులాం నబీ ఆజాద్ 6.మల్లికార్జున్ ఖర్గే 7.ఏకే ఆంటోనీ 8.అహ్మద్ పటేల్ 9.అంబికా సోని 10.ఊమెన్ చాందీ 11.తరుణ్ గొగోయ్ 12.సిద్దరామయ్య 13.ఆనంద్ శర్మ 14.హరీశ్ రావత్ 15.కుమారి సెల్జా 16.ముకుల్ వాస్నిక్ 17.అవినాశ్ పాండే 18.కేసీ వేణుగోపాల్ 19.దీపక్ బాబారియా 20.తామ్రద్వాజ్ సాహు 21. రఘువీర్ మీనా 22.గైకాంగమ్ గాంగ్మె 23.అశోక్ గెహ్లాట్