రాహుల్ కు అర్థంకాని తెలంగాణ రాజకీయం..!
Recommended Video
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్న చందంగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలను మొత్తం తన కనుసన్నల్లో ప్రక్షళన చేస్తుంటే., తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన మాత్రం ఆయనకు ఏకుమేకై కూర్చుంటోంది. కాంగ్రెస్ పార్టీలో ఇదే నా మాట., నా మాటే శాసనం అనే స్థాయి నాయకుడుకి కూడా తెలంగాణ రాజకీయం ఓ పట్టాన అర్థం కావడం లేదు. ఎటునుండి నరికితే ఏ సంక్షభం ముంచుకొస్తుందోననే సందేహంతో అసలు ప్రక్షాళనకే ముహూర్తం పెట్టడం లేదట ఆ నాయకుడు. ఎవరా నాయుకుడు..? ఏంటా కథ..?? ఒకసారి చూద్దాం..!!
రాహుల్ ని సందిగ్దంలోకి నెడుతున్న తెలంగాణ నాయకులు..
ఆయన కాంగ్రెస్ పార్టీకి యువరాజు. ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదం. ఆయనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ యువనేత అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించాక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్కో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అంచనా వేసి దానికి కాయచూర్ణ చికిత్స చేస్తున్నారు. సీనియారిటీ, కొత్త రక్తం మధ్య సమన్వయం సాధించి కొత్త కమిటీలతో ఆయా రాష్ట్రలలో పార్టీకి జవసత్వాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తి చేశారు. అదే క్రమంలో తెలంగాణలో సైతం పార్టీని ప్రక్షాళన చేయాలని రాహుల్ భావించారు. కానీ, టీ కాంగ్రెస్ నేతల వ్యవహారం ఆయనకు కొరుకుడుపడటం లేదు.
ప్రక్షాళనలో కూడా పెత్తనమేనా.. భగ్గుమంటున్న ఉత్తమ్ వ్యతిరేక వర్గం..
దేశం మొత్తానికి కాంగ్రెస్ సారథ్యం వహించే రాహుల్ కు తెలంగాణ నేతలు మాత్రం ఓ పట్టాన అర్థం కావడం లేదు. ఇక్కడ పార్టీ ప్రక్షాళన ఎలా చేయాలో తెలియక ఆయన తికమకపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఆరు నెలల నుంచి టీ కాంగ్రెస్ పునర్ వ్యవస్థీకరణ వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడమే దీనికి నిదర్శనం. ఇంతకీ... రాహుల్ కు అంతగా మింగుడు పడని వ్యవహారం టీ కాంగ్రెస్ లో ఏముంది? అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు చాంతాడంత సమాధానం వినిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్రే కీలకంగా కనిపిస్తోంది. అదృష్టం కలిసి వస్తే 2019లో ముఖ్యమంత్రి అయిపోవాలని ఉత్తమ్ ఉవ్విళ్లూరుతున్నారు. తప్పులేదు... కానీ, ఆ అవకాశం కోసం ఆయన కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారన్న చర్చ పార్టీలో జరుగుతోంది.
ఉత్తమ్ ముందు జాగ్రత్త.. మొదటికే మోసం వచ్చేలా ఉంది..
టీ కాంగ్రెస్ పునర్ వ్యవస్థీకరణలో ఏఐసీసీ అధిష్టానానికి ఉత్తమ్ ఇచ్చిన లిస్టు చూస్తే ఆయన ఎంత అభద్రతలో ఉన్నారో అర్థమవుతుందంటున్నారు. ఆయన సిఫార్సుల మేరకు పదవులు ఇచ్చి, పార్టీని ముందుకు నడిపితే పార్టీ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టు కావడం ఖాయం అంటున్నారు.
సామాజిక న్యాయం ముసుగులో ఉత్తమ్ తన మాట వినే వారికి పదవుల పంపకంలో పెద్దపీట వేస్తూ ఏఐసీసీకి జాబితా ఇచ్చొచ్చారని సమాచారం. పార్టీలో పీసీసీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ కన్వీనర్, వర్కింగ్ ప్రెసిడెంట్, ఇరు సభలలో ఫ్లోర్ లీడర్ల పదవులే కీలకమైనవి. అందులో పీసీసీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ కన్వీనర్ అన్నవి మరింత కీలకమైనవి. ఇప్పుడు ఈ రెండు పదవుల కోసమే పోటీ నడుస్తోంది. పీసీసీ పదవి నుంచి తప్పుకుని ఉత్తమ్ ఏఐసీసీ కమిటీలోకి వెళ్లడానికి సుముఖంగా లేరు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ ఆ పదవిలో ఉంటే... మిగతా పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనివార్యత కనిపిస్తోంది. లేదా... ఉత్తమ్ ను అలాగే ఉంచి, ప్రచార కమిటీకి రేవంత్ రెడ్డిని నియమించాలన్న ప్రతిపాదన ఉంది. మిగతా పదవులు మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీలతో భర్తీ చేయాలన్నది ఓ పార్ములా.
రేవంత్ కి అవకాశం ఇచ్చే యోచనలో రాహుల్.. వారిస్తున్న నేతలు..
అయితే, రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ ఇవ్వడానికి ఉత్తమ్ ఏ మాత్రం సుముఖంగా లేరు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలంటే ఉత్తమ్ ను పీసీసీ నుంచి తప్పించాలని రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్టు సమాచారం. ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ రెంటిలోనూ రెడ్లనే ఎలా నియమిస్తారన్నది రేవంత్ ప్రశ్న. అలాంటి నిర్ణయం చేస్తే అంతిమంగా అది పార్టీ ప్రయోజనాలకు నష్టం చేకూరుస్తుందని రేవంత్ రెడ్డి వాదిస్తున్నట్టు సమాచారం. రేవంత్ ఆర్గ్యూమెంట్ తో అధిష్టానం కూడా ఏకీభవించినట్టు చెబుతున్నారు. మరోవైపు డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి లాంటి నేతలందరినీ ఎలా సర్ధుబాటు చేయాలా అన్న సంకట స్థితిని సైతం అధిష్టానం ఎదుర్కుంటున్నట్టు తెలుస్తోంది.
మొత్తం మీద సామర్థ్యం, సామాజిక కోణాన్ని బ్యాలెన్స్ చేసి టీ పీసీసీని పునర్ వ్యవస్థీకరించాల్సి ఉంది. ఈ రెంటిని బ్యాలెన్స్ చేసే క్రమంలో నేతల వాదనలతో ఏఐసీసీకి ఇప్పటికే తలబొప్పికట్టినట్టు కనిపిస్తోంది. నేతల మాట కాదన లేక... పీసీసీ పునర్ వ్యవస్థీకరణ వ్యవహారం ముందుకు కదలక ప్రస్తుతానికి ఢిల్లీ నాయకత్వం దిక్కులు చూస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.