పొన్నాలకు 'జనగామ' లైన్ క్లియర్, కోదండరాం ఏం చేస్తారు? సనత్నగర్ మర్రి శశిధర్ రెడ్డికే!
Recommended Video
హైదరాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ అంశంపై లైన్ క్లియర్ అయింది. జనగామ నుంచి తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో పొన్నాల ఢిల్లీకి వెళ్లి పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలిశారు. గురువారం రాహుల్ను కలిసిన పొన్నాల తన బాధలు చెప్పుకున్నారు.
దశాబ్దాలుగా తాను అక్కడి నుంచి పోటీ చేస్తున్నానని, తనలాంటి సీనియర్ నేత స్థానాన్ని ఇతరులకు కేటాయిస్తే కాంగ్రెస్ కేడర్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారు. కానీ తొలుత రాహుల్ ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. చివరకు శుక్రవారం నాటికి పొన్నాల ఢిల్లీలోనే ఉండి లాబియింగ్ చేసి సాధించారు. జనగామ పొన్నాలకు క్లియర్ కావడంతో కోదండరాం ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. అసలు పోటీ చేస్తారా తెలియాలి. అసలు పోటీ చేస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
పొన్నాలకు లైన్ క్లియర్
మహాకూటమి పొత్తులో భాగంగా జనగామ, ఖమ్మం స్థానాలను మిత్రులకు కేటాయించినట్లు పొన్నాల లక్ష్మయ్య, పొంగులేటి సుధాకర్ రెడ్డిలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గురువారం చెప్పింది. రాహుల్ గాంధీ కూడా వారికి ఇదే విషయం చెప్పారు. అయితే తమలాంటి సీనియర్లకు టిక్కెట్ రాలేదంటే ఇబ్బందిగా ఉంటుందని వారు అధినేతతో చెప్పారు. మొత్తానికి పొన్నాల ప్రయత్నాలు మాత్రం ఫలించాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా పొంగులేటి కూడా కోదండకు ఫోన్ చేసి.. ఇప్పటికే బీసీల్లో వ్యతిరేకత ఉందని, పొన్నాల పరిస్థితిని అర్థం చేసుకోవాలని, మీరు మరోస్థానం చూసుకోవాలని సూచించారు. దీనికి కోదండరాం కూడా అది తాను కోరుకున్నది కాదని, పొత్తులో భాగంగా తనకు వచ్చిందని చెప్పారు. కోదండరాంతో పొన్నాల సాయంత్రం భేటీ కానున్నారు.
టీడీపీకి ఎవరితో ఓట్లేయించుకుంటారో చూస్తా.. కాంగ్రెస్ పార్టీకి షాక్, సబిత కొడుకు రాజీనామా
పొంగులేటికి రాహుల్ గాంధీ హామీ
ఇక పొంగులేటి ఆశలు పెట్టుకున్న ఖమ్మం స్థానాన్ని టీడీపీకి కేటాయించామని, మీకు తగిన న్యాయం చేస్తామని ఆయనకు రాహుల్ చెప్పారు. 2014లో ఖమ్మం లోకసభ నుంచి పోటీ చేస్తామంటే సీపీఐకి కేటాయించారని, ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తాంటే టీడీపీకి కేటాయించారని ఆయన వాపోయారు.
మర్రి శశిధర్ రెడ్డికే సనత్ నగర్!
పొత్తులో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారం సాగింది. దీంతో ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సనత్ నగర్ టిక్కెట్ను చివరకు మర్రికే ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. టీడీపీకీ సనత్ నగర్ బదులు మరో స్థానం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
పలువురికి బుజ్జగింపులు
మిర్యాలగూడ టిక్కెట్పై జానారెడ్డి తనయుడు రఘువీరా రెడ్డి కోరారు. జానారెడ్డిని రాహుల్ గాంధీ సముదాయించారు. హుజురాబాద్ స్థానంపై పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ టిక్కెట్ టీడీపీకి ఇద్దామని, తప్పుకోవాలని కుంతియా ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. పొత్తులో భాగంగా టీడీపీకి ఇబ్రహీంపట్నం వచ్చింది. సామ రంగారెడ్డి ఇక్కటి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో లేరు. ఆయన ఎల్బీనగర్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం స్థానాన్ని వెనక్కి తీసుకొని మల్రెడ్డి రంగారెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన క్యామా మల్లేష్, రాహుల్ గాంధీ నివాసం ఎదుట నిరసనకు దిగిన బండ కార్తీక రెడ్డికి పార్టీ అధిష్టానం నోటీసులు జారీ చేసే అవకాశముంది. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు.
తెలంగాణ జన సమితి సీట్లపై తర్జన భర్జన
పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితికి కాంగ్రెస్ 8 సీట్లు కేటాయించింది. వాటిలో మెదక్, దుబ్బాక, సిద్దిపేట, మల్కాజిగిరి, వర్ధన్నపేట, అంబర్పేట స్థానాలపై స్పష్టతను ఇచ్చింది. మరో రెండు స్థానాలను చూస్తే కోదండరాం వరంగల్ తూర్పును కోరుతుండగా మిర్యాలగూడను కాంగ్రెస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు జనగామ పొన్నాలకు క్లియర్ కావడంతో జన సమితికి మరో నియోజకవర్గం ఇవ్వాల్సి ఉంటుంది.