రాహుల్ అమాయకుడు ..అజ్ఞాని : గాడ్సే కి గాంధీ భవన్ ను అప్పగించారు - కేటీఆర్ ఫైర్..!!
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన...రైతు డిక్లరేషన్.. చేసిన రాజకీయ వ్యాఖ్యల పైన మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాహుల్ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. అసలు కుంభకోణాల కాంగ్రెస్ తో పొత్తు ఎవరు కోరారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో పొత్తు ఏ పార్టీ అయినా కోరుకుంటుందా అంటూ వ్యాఖ్యానించారు. మమ్మీ అధ్యక్షురాలు అయితే..కుమారుడు డమ్మీ అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఔట్ డేటెడ్ పార్టీ అని ధ్వజమెత్తారు. రాహుల్ అమాయకుడు..అజ్ఞాని అంటూ మండిపడ్డారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా క్రైసిస్ పార్టీ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ తో ఎవరైనా పొత్తు కోరుకుంటారా
సొంత సీటు అమేథీలో గెలవలేక..కేరళ పారిపోయారని ఎద్దేవా చేసారు. తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు కూడా గెలిపించలేక పోయారంటూ ధ్వజమెత్తారు. అంతరిక్షం నుంచి పాతాళం దాకా కాంగ్రెస్ అవినీతి పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. రెండు లక్షల రైతు రుణ మాఫీ అని చెబుతున్న కాంగ్రెస్ ..తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తొలుత అమలు చేసి చూపించాలని కేటీఆర్ సవాల్ చేసారు. మమ్మీ చేతిలో పాలన..డమ్మీ చేతిలో రిమోట్ అంటూ ఎద్దేవా చేసారు. ఏ పార్టీకి సీ..బీ పార్టీగా ఉండాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు.

గాడ్సేకు గాంధీ భవన్ ను అప్పగించారంటూ
రాహుల్ పక్కన ఓటుకు నోటులో దొరికన దొంగ అంటూ ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని అవినీతి గురించి మాట్లాడుతారా అని నిలదీసారు. గాడ్సేకు గాంధీ భవన్ ను అప్పగించారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నరనరానా ఆరెస్సెస్ భావజాలం ఉన్న వ్యక్తికి గాంధీ భవన్ అప్పగించారంటూ దుయ్యబట్టారు. ఎప్పుడు కొట్టుకుంటారో..ఎప్పుడు కలిసి ఉంటారో తెలియని నేతలు ఉన్న పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ రాజు అయితే టీపీసీసీ చీఫ్ బయట ఉంటాడా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అని ప్రచారం చేసుకోవటాన్ని కేటీఆర్ తప్పు బట్టారు. కేసీఆర్ తెలంగాణ కోసం పార్టీ పెట్టి.. పోరాటం చేస్తే..ప్రజలు తప్పని పరిస్థితి కల్పిస్తే...రాష్ట్రం ఇవ్వకపోతే ప్రజలే పాతరేసే పరిస్థితికి వస్తే తెలంగాణ వచ్చిందని కేటీఆర్ చెప్పారు.

రాహుల్ ఏ హోదాలో వచ్చారు
తెలంగాణ ఇచ్చిన వారు గొప్ప వాళ్లైతే..దేశానికి స్వాతంత్రం ఇచ్చిన బ్రిటీష్ వాళ్లు గొప్పవారేనా అని ప్రశ్నించారు. అసలు రాహుల్ ఏ హోదాలో తెలంగాణకు వచ్చారని నిలదీసారు. కాంగ్రెస్ పేరే స్కాంగ్రెస్ అంటూ విమర్శించారు. రైతులకు రుణ మాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం .. రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచింది టీఆర్ఎస్ ప్రభుత్వమని వివరించారు. తెలంగాణ రైతులు పూర్తి అవగాహనతో ఉన్నారన్నారు. దిక్కుమాలిన..కాంగ్రెస్ ను పాతర వేస్తే తప్ప..ఈ దేశంలో పరిస్థితిలో మార్పు రాదని చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీగా ఉంటూ రాష్ట్రానికో డిక్లరేషన్ ఇస్తారా అని ప్రశ్నించారు. సొంత ప్రధాని తెచ్చిన ఆర్డినెన్స్ ను ఆమోదించలేని వ్యక్తి రాహుల్ అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.