తెలంగాణ-ఢిల్లీ, అంబేద్కర్ నచ్చరు: కేసీఆర్, మోడీపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
Recommended Video
ఆదిలాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బైంసాలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ శనివారం మాట్లాడారు. ఎలావున్నారు? అంటూ రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రారంభించారు.
కేసీఆర్కు అంబేద్కర్ పేరు నచ్చలేదు
ఆదివాసీలు, దేశం కోసం పోరాడిన కొమురంభీంను మనం గుర్తు చేసుకుంటామని రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే అంబేద్కర్ను గౌరవించుకోవాలని అన్నారు. తెలంగాణ సీఎంకు అంబేద్కర్ పేరు నచ్చలేదని రాహుల్ చెప్పారు. అందుకే అంబేద్కర్ ప్రాజెక్టు పేరు మార్చారని అన్నారు. ప్రాజెక్టుల వ్యయం పెంచారని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతోంది
కేసీఆర్ ప్రభుత్వం.. ప్రాజెక్టుల కోసం లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించి భారీ అవినీతికి పాల్పడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోడీతో కలిసి రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసి బిల్లు ప్రవేశపెడతామని అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చారా?
కేసీఆర్.. ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇచ్చారా? అని నిలదీశారు. డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చాయా? అని ప్రజలను ప్రశ్నించారు. 12శాతం మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రతి ఇంటికీ నీరు వచ్చిందా? అని ప్రశ్నించారు.
మోడీ కూడా అబద్ధపు హామీలు
ఇక నరేంద్ర మోడీ ప్రతి కుటుంబానికి రూ.15లక్షలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 2కోట్ల మందికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఇచ్చారా? అని ప్రశ్నించారు. మోడీ, కేసీఆర్లు అబద్ధపు హామీలిచ్చారని ఆరోపించారు. తాము రూ. 70వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని అన్నారు.
మోడీ వారికి మాత్రమే సేవకుడు
మోడీ పేదల ప్రజలకు సేవకుడు కాదని.. మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, అంబానీలకు సేవకుడని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. వాయుసేన కోసం రాఫెల్ విమానాలను తాము రూ.548కోట్లకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే మోడీ ప్రభుత్వం దాన్ని మరింత పెంచి కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. రాఫెల్ ఒప్పందంలో ప్రభుత్వ కంపెనీ హెచ్ఏఎల్ ను కాదని, అనిల్ అంబానీకి చెందిన కంపెనీని చేర్చుతారా? అని ప్రశ్నించారు. హెచ్ఏఎల్ అనేక యుద్ధ విమానాలను తయారు చేసిందని అన్నారు. మోడీ ప్రభుత్వం రాఫెల్ విమానాలను రూ.16వేల కోట్లకు కొనుగోలు చేస్తోందని అన్నారు. అనిల్ అంబానీకి రూ.30వేల కోట్ల లాభం చేకూర్చేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కేసీఆర్.. ఢిల్లీ మోడీ..
మోడీ ప్రభుత్వం గబ్బరి సింగ్ ట్యాక్స్ జీఎస్టీ తెచ్చి చిన్న వ్యాపారులను దెబ్బతీసిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్.. ఢిల్లీలో మోడీ గద్దె దిగబోతున్నారని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే నెరవేరుస్తుందని అన్నారు. నయా తెలంగాణ తమతోనే సాధ్యమని రాహుల్ అన్నారు.