కేసీఆర్పై ఉత్తమ్ నిప్పులు: రాహుల్ గాంధీ భేటీలో నారా బ్రాహ్మణి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు. సరూర్ నగర్లో నిర్వహించిన విద్యార్థి నిరుద్యోగ సభలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా ఇంటికో ఉద్యోగం కాదు కదా ఊరికో ఉద్యోగం కూడా రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం నలుగురికి ఇద్యోగాలు దొరికాయన్నారు. కాంగ్రెస్ వస్తే నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. పది లక్షల మందికి నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోలేదన్నారు.
తెలంగాణ ఉద్యమంలో, ఏర్పాటులో విద్యార్థులది కీలక పాత్ర అన్నారు. గతంలో విద్యార్థులకు పీజు రీయింబర్సుమెంట్స్ సకాలంలో ఉండేవని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీదే విజయమని చెప్పారు.
అంతకుముందు యువ పారిశ్రామికవేత్తలతో రాహుల్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పన్నుల విధానంలో సమూల మార్పులు చేయనున్నట్లు తెలిపారు. జీఎస్టీ అమల్లో లోపభూయిష్టమైన విధానాల వల్ల చిన్న, మధ్యతరహా సంస్థలు తీవ్రంగా నష్టపోయానని యువ పారిశ్రామిక వేత్తల ప్రత్యేక భేటీలో రాహుల్ పేర్కొన్నారు.
సుమారు గంటన్నరపాటు యువ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన రాహుల్ పారిశ్రామిక విధానాలు, ఉద్యోగ, ఉపాధి కల్పనపై సమగ్రంగా చర్చించారు. రాహుల్తో సమావేశమవడం పట్ల పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల నుంచి 150 మందికి పైగా యువ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. నారా బ్రాహ్మణి, దగ్గుబాటి సురేష్తో పాటు పలు సంస్థల సీఈవోలు వచ్చారు.