ఒక్కో వ్యక్తిపై రూ.60వేల అప్పు: తెలంగాణపై రాహుల్ లెక్క, ఏం చెప్పారంటే..?
హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడితే.. కేసీఆర్ ప్రభుత్వం నూతన రాష్ట్రానికి ఏమీ చేయలదేని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అవినీతి పాలన అందిస్తామని చెప్పి.. పాలన అంతా అవినీతియమం చేశారని ఆరోపించారు.
తెలంగాణ-ఢిల్లీ, అంబేద్కర్ నచ్చరు: కేసీఆర్, మోడీపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
ఒక్కో వ్యక్తిపై రూ.60వేల అప్పు
తెలంగాణలో ప్రతి వ్యక్తిపై 60వేల రూపాయల అప్పు ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. కేసీఆర్ మాత్రం రూ.300కోట్లు ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. అయితే, కేసీఆర్ దగ్గర నిజాం షూగర్ ఫ్యాక్టరీకి తెరిపించేంత డబ్బు లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ సర్కారుదేనని మండిపడ్డారు.
కర్ణాటకలో చేశాం.. ఇక్కడా చేస్తాం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ చెప్పారు. రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, అది కూడా ఏకకాలంలోనే చేస్తామని అన్నారు. కర్ణాటకలో చేశామని, ఇక్కడ కూడా చేస్తామని అన్నారు. పంటలకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు.
తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు
తెలంగాణలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ తెలిపారు. తెలంగాణ సర్కారు 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. కేజీ టూ పీజీ, ఇంటింటికీ నీరు హామీ ఏమైందని రాహుల్ ప్రశ్నించారు.
ప్రజలతో కలిసి తమ పాలన
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయించలేదని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజలతో కలిసి తమ పాలన కొనసాగిస్తామని రాహుల్ చెప్పారు. దేశంలో కులం, మతం పేరుతో రెచ్చగొడుతున్నారని, అవన్నీ ఉండకుండా చేస్తామని అన్నారు. నోట్ల రద్దుకు కేసీఆర్ మద్దతు ఇచ్చి మోడీకి మద్దతుగా నిలిచారని అన్నారు. మోడీని కేసీఆర్ తోపాటు ఎంఐఎం సపోర్టు చేస్తోందని రాహుల్ అన్నారు.