చంద్రబాబు నాకు అప్పుడే చెప్పారు!: కూటమి సీఎం అభ్యర్థిపై రాహుల్ గాంధీ స్పందన
హైదరాబాద్: ప్రజాకూటమి తరఫున ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం స్పందించారు. నాలుగున్నర ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజల కలలు సాకారమవుతాయనుకున్నామని, కానీ అవి నెరవేరలేదని చెప్పారు. తాజ్ కృష్ణా హోటల్లో మహాకూటమి నేతలు అందరూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు.
దేశ రాజకీయాల్లో మార్పుకు తెలంగాణ ఎన్నికలే ఆరంభమని చెప్పారు. ఈ దేశానికి రైతులే వెన్నెముక అని, రైతులను అటు మోడీ, ఇటు కేసీఆర్ మోసం చేస్తున్నారని చెప్పారు. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని విలేకరులు అడగగా.. ఇప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థిని చెప్పలేమని, కేసీఆర్ని గద్దె దించడమే తమ ముందన్న ప్రధాన లక్ష్యమన్నారు.
రేవంత్రెడ్డి, ఖల్లాస్ కేసీఆర్: ట్విట్టర్లో ట్రెండింగ్, ఏం చేశారంటూ ప్రశ్నల వర్షం
అభద్రతా భావం
కేసీఆర్లో అభద్రతాభావం కనిపిస్తోందని చెప్పారు. ఆయన ప్రసంగాలను చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుందన్నారు. పలు సందర్భాల్లో ఆయన నియంత్రణ కోల్పోయారని, సభలకు వచ్చిన వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని చెప్పారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాన్ని కేసీఆర్ చేస్తున్నారని, ఇవన్నీ ఆయన ఎన్నికల జిమ్మిక్కులు అన్నారు.
టీడీపీతో కలిసి పని చేసేందుకు ఇబ్బంది లేదు
కొద్ది రోజుల్లో ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోబోతున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. తమ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వాన్ని నడిపించేది ప్రజలేనని, రాష్ట్రం కోసం త్యాగాలకు పాల్పడినవారి స్ఫూర్తితో ప్రభుత్వం నడుస్తుందన్నారు. టీడీపీతో కలసి పనిచేసేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందన్నారు.
చంద్రబాబు చెప్పారు
వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ దేశం మొత్తాన్ని మోడీ, అమిత్ షాలు ట్యాప్ చేస్తున్నారని తనతో చంద్రబాబు తొలిసారి భేటీ అయిన సందర్భంలో చెప్పారని రాహుల్ గాంధీ చెప్పారు. దేశాన్ని రక్షించడం కోసమే భావసారూప్యత కలిగిన వారమంతా చేతులు కలుపుతున్నామన్నారు. కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు కలసి పని చేయడంలో ఎలాంటి సమస్య ఉండదని చెప్పారు.
హైదరాబాద్ నుంచే పరిపాలన
దేశ రాజకీయాల్లో మార్పుకు ఇది ఆరంభమని చంద్రబాబు చెప్పారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్గా ఉండాలని చెప్పారు. అందరూ ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం నిలుస్తుందని చెప్పారు. మహాకూటమి అధికారంలోకి వస్తే అమరావతి, ఢిల్లీ నుంచి పాలన సాగుతుందన్న తెరాస విమర్శలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ... ప్రభుత్వం హైదరాబాద్ నుంచే సాగుతుందని చెప్పారు. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు.