ఖరారైన రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన..! ఏప్రిల్ ఒకటిన జహీరాబాద్ లో బహిరంగ సభ..!!
హైదరాబాద్ : శాసనసభ ఎన్నికల ఫలితాలతో కుదేలైన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కొంతయినా పరిస్థితి మెరుగుపరుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ముఖ్య నేతలు పార్టీ మారుతున్నప్పట్టికి ధైర్యంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతోంది. లోక్ సభ స్థానాల్లో హేమాహేమీలను రంగంలోకి దింపి అదికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే దిశగా రంగం సిద్దం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ మారతున్నప్పటికి కార్యకర్తల్లో భరోసా నింపేందుకు టీపిసిసి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా లోక్ సభ ఎన్నికల్లో ప్రచారాన్ని ఉద్రుతం చేయాలని, అందుకోసం జాతీయ నేతలను ఆహ్వానించాలని తెలంగాణ కాంగ్రెస్ క్రుతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఏఐసీసీ అద్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైనట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రచార పర్యటన ఖరారైంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాహుల్ ప్రచార షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగా మొదటి దశలో ఎన్నికలు జరగనున్న తెలంగాణ రాష్టంలో ఎన్నికల ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఈ వివరాలను ఉత్తమకుమార్ రెడ్డి ప్రకటించారు. ఏప్రిల్ 1 న జహీరాబాద్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు 12 గంటలకు చేరుకుంటాడని తెలిపారు. అక్కడ నుండి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గంలోని వనపర్తి లో జరిగే సభకు హాజరై ప్రసంగిస్తాడని చెప్పారు. అక్కడ నుండి సాయంత్రం 4 గంటలకు నల్గొండ జిల్లాకి చేరుకుంటారని, హుజూర్ నగర్ లో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటాడని రాహుల్ ప్రచార షెడ్యూల్ ని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాహుల్ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం రావడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.