కాంగ్రెస్ పార్టీకి ఆక్సీజన్ అందించనున్న రాహుల్ తెలంగాణ పర్యటన..!
ఏఐసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణపై ప్రత్యేక ద్రుష్టి సారించారు రాహుల్ గాంధీ. క్రియాశీల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు రాష్ట్ర నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టడంతో పాటు పార్టీలో యువతకు సముచిత స్థానం కల్పిస్తున్నారు రాహుల్ గాంధీ. అదే సమయంలో సీనియర్ లీడర్లకు కీలక పదవులను కట్టబెడుతున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్ చార్జీలను నియమించి పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు రాహుల్. అందులో భాగంగా టీ కాంగ్రెస్ పార్టీలో నూతన జోష్ నింపేందుకు స్వయంగా తెలంగాణ టూర్ ప్లాన్ చేసారు రాహుల్ గాంధీ.
రాహుల్ తెలంగాణ పర్యటన.. జోష్ లో కాంగ్రెస్ నాయకత్వం
బీజేపి ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్రాల నాయకత్వాన్ని సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల మీద రాహుల్ దృష్టి పెడుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్.. విభజన అనంతరం తెలంగాణలో ప్రతిపక్షానికి పరితమై, ఏపీలో ఉనికి కోల్పోయింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలని, అందుకోసం నాయకత్వం చురుగ్గా ప్రజాకార్యక్రమాల రూకల్పన చేసుకోవాలని రాహుల్ దిశానిర్ధేశం చేస్తున్నారు.
కేంద్రలో బీజేపి, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలే లక్ష్యంగా రాహుల్ ప్రసంగాలు..
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రజల కష్టాలు రెట్టింపయిన అంశాలతో పాటు టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానలను ప్రజల్లో ఎండగట్టేందుకు రాహుల్ రంగం సిద్దం చేస్తున్నారు. తెలంగాణ పర్యటన సందర్బంగా ప్రజా సమస్యల పరిష్కారం రాహుల్ గాంధీ భరోసా ఇవ్వబోతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలాంటి భ్రమలు కల్పిస్తుందో వివరించేందుకు తెలంగాణ నేతలతో కలిసి ప్రజా కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు రాహుల్. తెలంగాణలో స్తబ్దుగా ఉన్న పార్టీకి రాహుల్ పర్యటన ఆక్సీజన్ లా ఉపయోగపడుతుందని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణతో పాటు ఏపిలో రాహుల్ టూర్.. ఏర్పాట్లలో నిమగ్నమైన నాయకులు..
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ తెలంగాణ టూర్ ఖరారైంది. ఈ నెల 13, 14 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా కాంగ్రెస్ నేతలతో సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలో జరిగే బస్సు యాత్రలో రాహుల్ పాల్గొననున్నారు. మరోవైపు ఆయన ఈ నెల 18న కర్నూల్ లో ఒక భారీ బహిరంగ సభకు హాజరవుతారని సమాచారం. సభ తేదీ ఖరారు కానప్పటికీ ఈ నెలలోనే రాహుల్ గాంధీ రాష్ట్రానికి రాబోతున్నట్టు సమాచారం. ఒకప్పుడు ఇక్కడ పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు డోలాయమాన స్థితిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలలో ఒక్క సీటు రాలేదు. తెలంగాణాలో మాత్రం ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించగల్గింది. 2019 ఎన్నికలలో పార్టీ భాగ్య రేఖలు మార్చాలని రాహుల్ గాంధీ సంకల్పించారు.
టీ కాంగ్రెస్ నేతలకు పదవులు వరిస్తాయా.. ఉత్కంఠలో ఆశావహులు..
తెలంగాణపై కూడా రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు. ఒడిషా తరహాలో పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకుంటూనే, యువతకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే టీ.కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు రాహుల్ గాంధీ. అన్ని కులాల వారికి పార్టీలో సమప్రాధాన్యత నివ్వాలని రాహుల్ భావిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి కీలక పదవిని కట్టబెట్టేందుకు రాహుల్ రెఢీ అవుతున్నట్టు తెలుస్తోంది.