తెలంగాణ ఇన్చార్జీగా ఆజాద్ కాదంటే సచిన్!: ఇక్కడా గుజరాత్ ఫార్ములే..
హైదరాబాద్: తెలంగాణలో పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిశితంగా ద్రుష్టి సారించారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియాను మార్చాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు తెలిసింది. ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలట్ను గానీ, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ను గానీ నియమించనున్నారని సమాచారం. వీరిలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోటరీలో ముఖ్యుడిగా పేరు ఉన్న సచిన్కే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే వచ్చే ఏడాది చివరిలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఇటు కాంగ్రెస్ పార్టీకి, అటు సచిన్ పైలట్కు కూడా కీలకమే. ఈ నేపథ్యంలో గులాం నబీ ఆజాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్నప్పుడే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే కాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఆయనకు మంచి పట్టు కూడా ఉన్నదన్న అభిప్రాయం ఉన్నది.
పరిశీలనలో వాయలార్ రవి, రమేశ్ చెన్నితల తదితరుల పేర్లు
ఈ నేపథ్యంలో ఆజాద్కే మళ్లీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించవనచ్చునన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వీరిద్దరితోపాటు పార్టీ సీనియర్ నేతలు వయలార్ రవి, రమేశ్ చెన్నితల, ముకుల్ వాస్నిక్ పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు గుజరాత్ తరహా వ్యూహాన్నే తెలంగాణలోనూ రాహుల్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారన్న వార్తలు వినవస్తున్నాయి. మరోవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి పీసీసీని పూర్తిగా ప్రక్షాళన చేసి యువ రక్తంతో నింపాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ తర్వాతే ఇన్చార్జీ మార్పుపై రాహుల్ నిర్ణయం
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ వ్యూహాలను ఎదుర్కోవడానికి కుంతియా సామర్థ్యం సరిపోవడం లేదని టీపీసీసీలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయన్ను మార్చి మరో నేతకు బాధ్యతలు అప్పగించాలని జాతీయస్థాయిలో సంబంధాలు గల కొందరు నేతలు రాహుల్ను కోరినట్టుగా తెలిసింది. పార్టీలో యువతరానికి పెద్దపీట వేయాలని భావిస్తున్న రాహుల్తోపాటు ఏఐసీసీ ముఖ్యులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నూతన రూపు వంటి కసరత్తు పూర్తయిన వెంటనే రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
సామాజిక నేతలతో టీపీసీసీ నేతల సంప్రదింపులు ఇలా
తెలంగాణలోనూ గుజరాత్ ఫార్ములా ప్రయోగించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యూహం రూపొందిస్తున్నారని తెలుస్తున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆకర్షించేందుకు ప్రణాళిక రచించినట్లు వినికిడి. అందులో భాగంగా సామాజిక ఉద్యమ సంఘాలు, నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. సామాజిక ఉద్యమ సంఘాలు, ఉద్యమ నేతలతో కలసి వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగాలని యోచిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో రాహుల్ రాయబారులు రంగంలోకి దిగారని విశ్వసనీయంగా తెలిసింది. కులాల వారీగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కార్యక్రమాలకు దీటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆకర్షించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యాచరణ చేపట్టారని వినికిడి. అంతే కాదు దీనిపై ఏఐసీసీ స్థాయిలోనే చర్చించి నిర్ణయం తీసుకోవాలని పార్టీ ఉన్నట్లు సమాచారం.
లేదంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు కోసం రాహుల్ యత్నం
ఇటీవలి గుజరాత్ ఎన్నికల్లో హార్దిక్ పటేల్ (పాస్ ), అల్పేషీ ఠాకూర్ (ఓబీసీ ఉద్యమ నేత), జిగ్నేష్ మేవానీ (దళిత హక్కుల కార్యకర్త)లతో కలసి అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణలో అమలు చేసేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ వేస్తోంది. అందులో భాగంగానే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులను ఆకర్షించే ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలిసింది. వీరిని పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, వీలు కాకుంటే పార్టీకి అనుకూలంగా పని చేయడానికి రాహుల్ ప్రతినిధులు ప్రయత్నిస్తారని సమాచారం. ఏఐసీసీ స్థాయిలో జరుగుతున్న ఈ ప్రయత్నాలు ఆచరణలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనని రాష్ట్ర నేతలు ఆసక్తి చూపుతున్నారు.
టీఆర్ఎస్ వల్లే ఆదివాసీలు, లంబాడీల మధ్య ఘర్షణ అన్న ప్రచారం
ఎస్సీ వర్గీకరణ కోసం ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ చేపట్టిన మంద కృష్ణ మాదిగ.. అందులో భాగంగా ప్రస్తుతం అరెస్టయ్యారు. మంద కృష్ణను కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పరామర్శించినా రాజకీయ చర్చలెలా ప్రారంభించాలని మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లంబాడీ, ఆదివాసీల మధ్య పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ల హామీ అమలు చేయాలని ఎస్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన ఎల్హెచ్పీఎస్ నేత బెల్లయ్యనాయక్ సహా పార్టీలోని గిరిజన నేతలు కసరత్తు ప్రారంభించారు. లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చుకు టీఆర్ఎస్నే కారణమనే ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తంగా గుజరాత్ ఫార్ములాను రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీల నేతలతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు
రాష్ట్రంలో కుల వృత్తుల వారీగా సీఎం కేసీఆర్ పలు పథకాలు అమలు చేస్తున్నారు. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ.. ముదిరాజ్, బెస్త వారికి చేప పిల్లల పంపిణీ పథకాలు ప్రారంభించారు. వివిధ కుల వృత్తులకూ పథకాలు ప్రారంభించి ఆయా వర్గాలను టీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.బీసీల అభివృద్ధి కోసం ఇటీవల మూడు రోజులు వర్క్షాప్నూ నిర్వహించిన ప్రభుత్వం.. వర్క్షాపులో వచ్చిన ప్రతిపాదనలు, డిమాండ్ల అమలుకు ప్రయత్నిస్తోంది. వృత్తులకు సంబంధించిన అంశాలకే బీసీలను పరిమితం చేయడాన్ని పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాన్, రాజకీయాభివృద్ధి, విద్య, ఉద్యోగాల్లో పథకాలను డిమాండ్ చేస్తున్నాయి. ఆ డిమాండ్లపై ఉద్యమాలు చేసే అవకాశాల కోసం కాంగ్రెస్ అన్వేషిస్తోంది. వాటి కోసం ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అన్ని స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణ
ఇక తెలంగాణలో పార్టీని సంస్థాగతంగానూ బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీ స్థాయి నుంచి కింది వరకు పునర్వ్యవస్థీకరించే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రత్యేకించి యువ నేతలకు పెద్దపీట వేయాలని సమాచారం. ఇక కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ నేతలను సలహాదారుల పాత్రకు పరిమితం చేయాలని.. అందునా 55 ఏళ్లు దాటిన వారిలో కొందరు మినహా అందరికి టిక్కెట్లు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్లు సమాచారం. ప్రత్యేకించి వరుసగా మూడుసార్లు ఓటమి పాలైన వారికి అవకాశాలు ఇవ్వరాదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
రంగంలోకి రాహుల్ టీం.. ఆ సర్వే ప్రకారమే టిక్కెట్ల పంపిణీ
నేతల కీర్తి ప్రతిష్ట, విజయావకాశాలను ఇక మర్చిపోవాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు అభ్యర్థుల ఎంపికలో పీసీసీ కీలకంగా వ్యవహరించేది. పీసీసీలోనూ యువకులనే నియమించాలని రాహుల్ యోచిస్తున్నారని వినికిడి. గత ఎన్నికల్లో 30 నుంచి 50 వేలకు మించిన మెజారిటీతో ఓటమి పాలైన నేతలను నిర్ద్వంద్ద్వంగా పక్కనబెట్టేయాలని స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. స్థానిక సమస్యల పట్ల వారి అవగాహన ప్రాథమ్యంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందే తప్ప అర్థబలం, రాజకీయ నేపథ్యం ఎంత మాత్రం ఇక ఉపకరించదని చెప్తున్నారు. ఇందుకోసం రాహుల్ గాంధీ అన్ని అసెంబ్లీ స్థానాల్లో సామర్థ్యం గల నేతల ఎంపికకు సర్వే చేపట్టారని.. దాని ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని టీపీసీసీ వర్గాలు తెలిపాయి.