విషాదం: రైలు ఢీకొని ఢిగ్రీ విద్యార్థినితోపాటు ముగ్గురు మృతి
కామారెడ్డి: జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు దాటుతుండగా.. వేగంగా వచ్చిన గూడ్సు రైలు ఢీకొన్న ఘటనలో డిగ్రీ విద్యార్థినితోపాటు ముగ్గురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
భిక్కనూరు మండలం తిప్పాపూర్కు చెందిన డిగ్రీ విద్యార్థిని బోయిని నవ్య(19) కామారెడ్డిలోని కళాశాలకు వెళ్లే నిమిత్తం.. కాచిగూడ నుంచి మన్మాడ్ వెళ్లే ప్యాసింజర్ ఎక్కారు. లింగంపేట్కు చెందిన బాలవ్వ(60), మెదక్ జిల్లా జాన్సిలింగాపూర్కు చెందిన ఆమె మనవడు(కుమార్తె కుమారుడు) సర్వేంద్ర(3)తో ఇదే రైలులో ప్రయాణించారు.
ఈ ముగ్గురూ కామారెడ్డి రైల్వేస్టేషన్లో దిగారు. తమ గమ్యాలకు చేరుకోవాలనే ఆతృతలో పట్టాలు దాటుతుండగా.. నిజామాబాద్ వైపు వెళ్లే గూడ్స్రైలు ఢీకొంది. నవ్య, సర్వేంద్ర ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. బాలవ్వ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. ముగ్గురి మృతితో వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.