రైల్వే ఉద్యోగాల పేరిట మోసం: రూ. లక్షలు కాజేశాడు
కాజీపేట: దక్షిణ మధ్య రైల్వేలో గ్రూపు-డీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దాదాపు 25 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షల వరకు వసూలు చేసిన ఉదంతం కాజీపేటలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. రైల్వేలో ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి, నకిలీ ఉద్యోగ ఉత్తర్వు కాపీని యువకులకు చూపించి ఆశ కల్పించారు కొందరు దుండగులు.
పల్లగుట్ట, కాజీపేట, వర్ధన్నపేట తదితర ప్రాంతాలకు చెందిన 25 మంది యువకులు అప్పులు చేసి కొందరు, భూములు అమ్ముకుని మరికొందరు, డబ్బులు పోగు చేసి వారికి అందజేశారు. రైల్వే ఉద్యోగం వస్తుందని ఎదురుచూసిన వారికి ఎంతకీ పిలుపు రాకపోవడంతో వారిచ్చిన లెటర్తో డబ్బులు తీసుకున్న వ్యక్తుల వద్దకు వెళ్లారు.
మొత్తం నలుగురు వీరి నుంచి డబ్బులు తీసుకున్నారని చెప్పారు. తమకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం ఎందుకు చేశారని నిలదీస్తే.. తొందరపడితే రావని ఒకసారి, మీరెప్పుడు డబ్బులు ఇచ్చారని మరోసారి ఇలా మాటమార్చి పంపించారు. ఒకరికి తెలియకుండా మరొకరు దాదాపు 25 మంది ఆదివారం కాజీపేట రైల్వే క్వార్టర్స్లో ఉంటున్న ఓ క్లర్క్ ఇంటికి వెళ్లి అతన్ని నిలదీసి కాజీపేట పోలీసుస్టేషన్కు తీసుకొచ్చారు.
పోలీసులు విచారణ చేస్తే తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని బుకాయించాడు. గతంలో ఈ వ్యవహారంపై మడికొండ పోలీసుస్టేషన్లోనూ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రైల్వే ఉద్యోగిపై నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తేలు సారంగపాణి, డి.రవికుమార్, హైమావతి, శివకుమార్, నరేష్కుమార్లు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
ఐనవోలు: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెంకాపూర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సుధాకర్(43)కు మూడు ఎకరాల సొంత భూమి ఉండగా 3 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాడు.
పెట్టుబడులు పెరిగి దిగుబదులు తగ్గి తెచ్చిన అప్పులు భారమయ్యాయి. దీంతో కొంత కాలంగా మానసికంగా కుంగిపోయాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆదివారం ఇంట్లో భార్య పిల్లలు లేని సమయంలో పురుగుల మందు తాగాడు. స్థానికులు గుర్తించి ఎంజీఎంకు తీసుకెళ్లగా మృతిచెందాడు. మృతుడికి భార్య రమ, ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. వ్యవసాయంలో చేసిన అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.