సికింద్రాబాద్లో కాకినాడ చిన్నారి కిడ్నాప్: ఛేదించిన రైల్వే పోలీస్, మహిళ అరెస్ట్
హైదరాబాద్: వారం రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్కు గురైన ఐదేళ్ల చిన్నారి దుర్గ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. కాకినాడకు చెందిన రాణి తన కూతురు దుర్గతో వారం క్రితం సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో ఉన్న సమయంలో కిడ్నాప్కు గురైంది.
సికింద్రాబాదు రైల్వే స్టేషన్లోని సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. చిన్నారి దుర్గను నల్గొండలో గుర్తించారు. దుర్గను కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దుర్గను తల్లి రాణికి అప్పగించారు.
కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చిన్నారిని గుర్తు తెలియని అగంతకురాలు గతవారం కిడ్నాప్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా చేబ్రోలుకు చెందిన రాణి నగరంలో ఉంటున్న తన సోదరుడి ఇంటికి ఐదేళ్ల కుమార్తె దుర్గతో వచ్చింది. శుక్రవారం తిరిగి తన స్వగ్రామానికి వెళ్లడానికి సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకుంది.
స్టేషన్ ఆవరణలో రాణితో గుర్తు తెలియని అగంతకురాలు చనువుగా మాట్లాడడంతో ఇరువురు కలిసి కొంతసేపు ముచ్చటించుకున్నారు. ప్రక్కనే తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. రాణి స్టేషన్లోకి వెళ్లడానికి ముందు నడుస్తుండగా అగంతకురాలు చిన్నారి దుర్గను ఎత్తుకుని వెనకే వస్తున్నట్లు నటించింది.
స్టేషన్ ఆవరణలోకి రాణి వెళ్లింది. తన కూతురు, అగంతకురాలు కనిపించకపోవడంతో కలత చెంది వెతికినా లాభం లేకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులు విషయం చెప్పింది. చిన్నారి కోసం స్టేషన్ అంతా గాలించారు. స్టేషన్ బయట, లోపల ఉన్న సిసి ఫుటేజ్లను పరిశీలించి నిందితురాలి కదలికలను గుర్తించారు. ఆ దిశగా కేసును ఛేదించారు.