లైంగిక వేధింపుల రగడ: వేధించాడు, విద్యార్హతలు అడినందుకేనని ఎస్పీ
హైదరాబాద్: రైల్వే ఎస్పీ జనార్ధన్ తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు కనకదుర్గ మరోమారు ఆరోపించారు. ఎస్పీ వేధింపులపై ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఫిర్యాదుపై ఆమె స్పందించారు. రైల్వే ఎస్పీ తనను లైంగికంగా వేధించాడని, ఎస్పీ కావడంతో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, అందుకే హైకోర్టును ఆశ్రయించానని, కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని ఆమె అన్నారు.
ఇదిలావుంటే, విద్యార్హతలు ప్రశ్నించినందుకే తనపై లైంగిక ఆరోపణలు చేసినట్లు రైల్వే ఎస్పీ జనార్ధన్ తెలిపారు. బాధితురాలు దుర్గ రైల్వే ఎస్పీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్. హైకోర్టు ఆదేశాలతో రైల్వే పోలీసులు ఎస్పీ జనార్ధన్పై కేసు నమోదు చేశారు. మహిళ ఆరోపణలపై ఎస్పీ స్పందించారు.
దుర్గ ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆమె తచన కార్యాలయంలో గంటపాటు కూడా పనిచేయలేదని ఆయన చెప్పారు. నకిలీ సర్టిఫికెట్స్తో దుర్గ ఉద్యోగంలో చేరిందని, విద్యార్హతలను ప్రశ్నించినందుకే తప్పుడు కేసు పెట్టారని ఆయన అన్నారు. పోలీసుల దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని, విచారణలో నిజాయితీని నిరూపించుకుంటానని ఆయన అన్నారు.
లైంగికదాడికి యత్నించారన్న ఫిర్యాదుతో సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జనార్దన్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులతో గురువారం రైల్వే జీఆర్పీ పోలీసులు సెక్షన్ 354, 506 రెడ్విత్ 34ల కింద రైల్వే ఎస్పీ జనార్దన్ మీద ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు.
సికింద్రాబాద్ రైల్వే జీఆర్పీ పోలీసు విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగి తనను ఎస్పీ వేధింపులకు గురిచేస్తున్నాడని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించారు.