ఏపీ-తెలంగాణలకు కేంద్రం మొండిచేయి! రాజ్నాథ్ చెప్పినంతలోనే..
న్యూఢిల్లీ: ఏపీకి రైల్వే జోన్, తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కుదరదని కేంద్ర హోంశాఖ టాస్క్ ఫోర్స్.. సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పదో షెడ్యూలు సంస్థల విభజన కూడా అవసరం లేదని పేర్కొంది. అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని ప్రస్తావించలేదు. విభజన చట్టం అమలుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై కేంద్ర హోంశాఖ కౌంటర్ అఫిడవిట్ వేశారు.
చట్టాన్ని అమలు చేయాల్సిన నోడల్ శాఖగా అందులోని హామీల అమలుపై ఆయా శాఖల అధికారులతో, రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో ఈ ఏడాది జనవరి 22న, మార్చి 23న, మే 29న జరిపిన సమావేశపు వివరాలను అనుబంధ పత్రాల రూపంలో దానితో జతపరిచారు. రైల్వే జోన్, రైల్వే కోచ్, అమరావతి నిధులు, ఉద్యోగుల విభజన అంశంపై కౌంటర్ దాఖలు చేసింది.
కొత్త జోన్తో ఫలితం ఉండదు
ఏపీలో రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్యసభలో చెప్పారు. కానీ ఇప్పుడు టాస్క్ఫోర్స్ అందుకు భిన్నంగా కౌంటర్ దాఖలు చేసింది. ఈ ఏడాదిలో వివిధ మంత్రిత్వశాఖలతో మూడు దఫాలు నిర్వహించిన సమావేశాల్లో విభజన చట్టం అమలు వ్యవహారాలు పర్యవేక్షించామని, దీనికి అధికారులు హాజరయ్యారని తెలిపింది. సమావేశాల మినిట్స్ను కోర్టుకి అందజేసింది. టాస్క్ఫోర్సు సమావేశం చర్చలో దేశంలో పదహారు రైల్వేజోన్లు ఉన్నాయని, కొత్త జోన్తో పెద్దగా ఉపయోగం ఉండదని అభిప్రాయపడినట్టు తెలిపింది.
తుది నిర్ణయం తీసుకుంటాం
దేశంలో ఇప్పటికే అయిదు కోచ్ ఫ్యాక్టరీలు సరైన వినియోగంలో లేవని కాబట్టి మరో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని టాస్క్ఫోర్స్ భావించినట్లు పేర్కొంది. అయితే ఇప్పటికే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో రైల్వే శాఖ సీనియర్ అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశామని, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటు సభ్యులు, ఇతర భాగస్వాములతో సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. పదో షెడ్యూల్లోని సంస్థల విభజన అవసరం లేదని చట్టంలోని సెక్షన్ 75 చెబుతోందని పేర్కొంది.
ఏపీ ప్రభుత్వానికి సూచించాం
విభజన చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు వల్ల సమీప పోర్టులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఏర్పాటు సాధ్యం కాదని దీంతో మరో స్థలం చూపాలని ఏపీ ప్రభుత్వానికి సూచించామని సుప్రీంకు తెలిపింది. కడప, బయ్యారంలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై టాస్క్ఫోర్సు ఏర్పాటు చేశామని, రాష్ట్రాలు, మెకాన్ ఇచ్చే సమాచారం బట్టి సాధ్యాసాధ్యాల నివేదిక ఆధారపడి ఉంటుందని చెప్పింది. తెలంగాణలో 3053 కిలో మీటర్ల కొత్త జాతీయ రహదారులు ప్రకటించారని, దీనిపై డీపీఆర్ అందాల్సి ఉందన్నారు.
రాజధాని అమరావతి, మోట్రోపై..
నూతన మెట్రో విధానానికి అనుగుణంగా ఉంటేనే విజయవాడలో మెట్రోకు ఆమోదం తెలుపుతామని హోంశాఖ తెలిపింది. రాజధానికి రూ.2,500 కోట్లు ఇచ్చామని, వాటికి యూసీలు వచ్చాయని, విజయవాడ, గుంటూరు నగరాల్లో డ్రెయినేజీ మెరుగుపర్చడానికి రూ.1000 కోట్లు విడుదల చేశామని పేర్కొంది. వాటికి సంబంధించి యూసీలు రాలేదని తెలిపింది. గిరిజన విశ్వవిద్యాలయం, మెట్రో పాలసీలు, ప్రాజెక్టులు తదితర అంశాలను ప్రస్తావించింది.