వర్షం ఎఫెక్ట్: తెలంగాణలో సెలవులు రద్దు, రోడ్ల పరిస్థితిపై ధర్నా
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో నీటి పారుదల శాఖ అధికారులకు సెలవులు రద్దు చేశారు. ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు తెలిపారు. వర్షాలపై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల వల్ల నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో చెరువులు తెగే ప్రమాదం ఉందన్నారు. చెరువులు, తూములు తెగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
ప్రమాదస్థాయిలో హుస్సేన సాగర్, మరో గంట కురిస్తే..: 'రోడ్లపైకి రావొద్దు'
ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. చెరువుల పొంగుతున్న చోట యుద్ధప్రతిపాదికన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా క్షమించేది లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి సమీక్షిస్తున్నారన్నారు. కాగా, వర్షాల వల్ల పలుచోట్ల స్కూళ్లు, ఆఫీసులు బంద్ అయ్యాయి.
టిఎన్ఎస్ఎఫ్ ధర్నా
భాగ్యనగరంలో రోడ్లు ధ్వంసమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆరోపించింది. రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పంజాగుట్టలోని మోడల్ హౌస్ వద్ద కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
నగరవ్యాప్తంగా తెరిచి ఉన్న మ్యాన్హోళ్ల చిత్రాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేసి, గోషామహల్ పోలీస్ స్టేషన్ తరలించారు.