వెదర్ అప్డేట్: రెండ్రోజుల తర్వాత తెలంగాణకు భారీ వర్ష సూచన
గత మూడురోజులుగా తెలంగాణలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో వర్షాకాలంలో ఎండలు దంచి కొట్టాయి. ఇక రానున్న రెండు రోజుల్లో వాతావరణం చల్లబడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మూడురోజుల క్రితం రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించిన వడగాలులు తగ్గుముఖం పట్టనున్నాయి. అరేబియన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో వడగాలులు దిశను మార్చుకోనుండటంతో తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఉండనుంది.
రాజస్థాన్ నుంచి వచ్చిన వడగాలులతో తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంది. ఇక మరో రెండు రోజుల తరువాత తెలంగాణ ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం కలగనుంది. మరోవైపు కేరళ, తమిళనాడుకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఓ భారీ విపత్తు తర్వాత కేరళ తిరిగి కోలుకుంటున్న సమయంలో మళ్లీ తుఫాను బెడద ఆ రాష్ట్రాన్ని వణికిస్తోంది. 2018-19 సెప్టెంబర్ వరకు తెలంగాణలో 661 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 719 మిల్లీమీటర్లు ఉండగా ఈ సారి అది 8శాతానికి పడిపోయింది.
మధ్య తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. మేడ్చల్లో 23 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా... సంగారెడ్డిలో 42శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ గణాంకాలు సెప్టెంబర్ వరకు తీసుకున్నవి. అదే గతేడాది సెప్టెంబర్లో 15 జిల్లాల్లో వర్షపాతం మెండుగా నమోదైంది. నిజామాబాద్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి జిల్లాల్లో అతి తక్కువ స్థాయిలో భూగర్భ జలాలు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఉత్తర తూర్పు తెలంగాణల్లో 28శాతం ప్రాంతాల్లో ఉపరితల నీటి లభ్యత ఉందని ప్రభుత్వం పేర్కొంది.
ఇక రెండు రోజుల తర్వాత తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు సాయంత్రం సమయాల్లో హైదరాబాద్ నగరంలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.ఇక పగటి పూట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్ ఉండగా... రాత్రి ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉంది.