ధంచి కొట్టిన వాన.!హైదరాబాద్ను ముంచెత్తి, మురిపించి తొలకరి ఝల్లు.!!
హైదరాబాద్ : నగరం తడిసి ముద్దయింది. హైదరాబాద్ నగరం తొలకరి పలకరింపుతో పులకరించిపోయింది. ఉక్కపోతతో ఉఫ్ ఉఫ్ అనుకుంటున్న నగరవాసులు చల్ల గాలులు హాయిగా పలకరించాయి. హైదరాబాద్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం నగరాన్ని ముంచెత్తింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. నల్లటి మేఘాలకు బదులు పుసుపురంగు మేఘాలుకమ్ముకోవడం నగరంలో వెలుగు క్షీణించింది. దీంతో మద్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఓ మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
తడిసి ముద్దయిన నగరం.. తొలకరి పలకరింపుతో పులకరించిన నగర వాసులు..
జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కోఠి, అబిడ్స్, హిమాయత్నగర్, మెహదీపట్నం, లంగర్హౌస్, కూకట్ పల్లి, మూసాపేట తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు రోడ్లపై చెట్లు విరిగిపడటంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో గంటసేపు వర్షం ఆగకుండా కురవడంతో, రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
వేసవి తాపం నుండి ఉపశమనం.. చల్లటి జల్లులతో సేద తీరుతున్న జనం..
ఇదిలా ఉండగా వేసవి భగభగల నుండి తెలుగు రాష్ట్రాలు ఉపశమనం పొందాయి. తొలకరి పలకరించడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతను, వేడిని తరిమికొట్టారు. అంతే కాకుండా ఆకాశం నుండి నుంచి నేలకు నీటి వంతెనలు వేస్తున్నట్లగా లయ బద్దంగా తొలకరి వాన కురిసింది. ఉక్కపోతతో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జనం ఇబ్బందులు పడ్డారు. అదే సాయంత్రం మొదలైన చిరు చినుకులు చల్లటి మధురాని భూతులను తెలుగు ప్రజలకు పంచాయని చెప్పొచ్చు.
నైరుతీ వచ్చినట్టే.. మరో మూడు రోజులు వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ..
తెలుగు రాష్ట్రాలను తొలకరి పలకరించడంతో నగర వాసులు పులకింతలకు హద్దు లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలకరి అనుకోకుండా అకస్మాత్తుగా పలకరించడంతో రిలాక్స్ అవుతున్నారు నగర యువత. బుదవారం సాయంత్రం మొదలైన తొలకరి జల్లులు గురువారంతో పాటు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాలో చల్లని గాలులతో కూడిన చిరు జల్లులు కొనసాగుతున్నాయి. ఈ నెల 1న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులు తున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ దాటుతూ తెలంగాణ వైపు పయనిస్తున్నట్టు వాతావరణ శాఖ నిర్ధారిస్తోంది.
Recommended Video
వర్షాకాలం వచ్చేసింది.. ఉపరితల ఆవర్తనాలతో జాగ్రత్తలు చెప్తున్న వాతావరణ అధికారులు..
ఇదిలా ఉండగా బెంగాల్, తమిళనాడు తదితర ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నాటికి మహారాష్ట్ర, కర్ణాటక లతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా రుతుపవనాలు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో గురువారం తెలంగాణ రాష్ట్రం లోని కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. బుధవారం నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తుండటంతో చాలా చోట్ల తొలకరి జల్లులు కురుస్తున్నట్టు తెలిపారు.