Rains In Telangana: మరో మూడు రోజులు వానలే.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుసే అవకాశమున్నట్లు పేర్కొంది. బుధ, గురువారాల్లో 24 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు వివరించింది. ఎల్లుండి మరో 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కొనసాగుతుందని తెలిపింది. బుధవారం అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు అలెర్ట్ జారీ చేశారు.
భువనగిరి జిల్లాలో 17 సెంటీమీటర్లు
మంగళవారం అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. హైదరాబాద్లో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. నిర్మల్ జిల్లాలో 13.3 సెంటీమీటర్లు, జగిత్యాలలో 10.5 సెంటీమీటర్లు, నల్గొండలో 10.4 సెంటీమీటర్ల వర్షం పడింది. మరోవైపు రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైంది. జూన్ లో రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతిరుతుపవనాలు. మరో 15 రోజుల్లో నిష్క్రమించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
3.1కిలోమీటర్ల ఎత్తులో
బంగాళాఖాతం పశ్చిమ, మధ్యప్రాంతంలో గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1కిలోమీటర్ల ఎత్తువరకు ఆవరించి ఉందని... మరోవైపు తూర్పు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అక్టోబర్ ఒకటిన ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది ఇలా ఉంటే సోమ, మంగళ వారం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో వర్షాపు నీరు ఇళ్లలోకి వచ్చింది.
దెబ్బతిన్న రోడ్లు
మెయిన్ రోడ్డు నుంచి ఖైరతాబాద్ మార్కెట్ వెళ్లే దారిలో మోకాలి లోతులో నీరు నిలిచింది. జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమించి నీటిని ఎత్తిపోశారు. పలు కాలనీల్లో ఇప్పటికీ నీరు నిలిచిపోయింది. వర్షాల కారణంగా రోడ్లు గుంతలు పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బోరబండ నుంచి మాదాపూర్ వచ్చే రోడ్డు మొత్తం బురద మయంగా మారింది.