ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం ... నీట మునిగిన గ్రామాలు, కాలనీలలో సహాయక చర్యలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరంలోని కాలనీలు నీటమునిగాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కటాక్షపుర్ చెరువులో బస్సు నీట చిక్కుకుంది. అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను ప్రారంభించింది. ఇప్పటికే ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Recommended Video
ఏపీ ,తెలంగాణా రాష్ట్రాలకు వాన గండం ..తెలంగాణలో 27 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షం ..పరిస్థితి ఇలా
వరంగల్ మహా నగరంలో నీట మునిగిన కాలనీలు , సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖిల్లా వరంగల్ పరిధిలోని ఉర్సు బి ఆర్ నగర్ నీటమునిగింది. దాదాపు 500 ఇళ్లలోకి నీరు చేరింది. అధికారులు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వెయ్యి మందికి పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గిర్మాజీపేట్, శివ నగర్ అండర్ బ్రిడ్జి వద్ద వరద నీరు ముంచెత్తడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఎటు వాహనాలు అటే నిలిచిపోయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది .మరోపక్క హన్మకొండ అంబేద్కర్ నగర్ వరద ముంపుకు గురైంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా అధికార యంత్రాంగం తో కలిసి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పర్యటించారు. అక్కడి పరిస్థితులు తెలుసుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హనుమకొండ కాకతీయ కాలనీ వడ్డెర వీధి వరద ముంపుకు గురైంది. దాదాపు వంద మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
హన్మకొండలోని ములుగు రోడ్డు వద్ద ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక హన్మకొండలోని సమ్మయ్య నగర్ కూడా మునిగిపోవడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు .
ప్రమాదకరంగా గోపాలపురం చెరువు .. మేడారం జంపన్న వాగు ఉధృతం
హన్మకొండ లోని గోపాలపురం చెరువు ప్రమాదకరంగా తయారైంది. గోపాలపురం చెరువుకు గండి పడే అవకాశం ఉన్నట్లుగా తెలియడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఉన్న అమరావతి నగర్ లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ములుగు జిల్లాలో చూస్తే మేడారం సమీపంలోని జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మేడారం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రస్తుతం మేడారం గద్దెలపైకి వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది.మేడారం వరకు రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలో ఉధృతంగా చలివాగు .... పరకాల , భూపాలపల్లి రహదారి జలమయం
వరంగల్ రూరల్ జిల్లాలో వర్షాల ధాటికి నర్సంపేట పట్టణం లోని ఎన్టీఆర్ కాలనీ ముంపుకు గురికాగా అక్కడ వరద బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావంతో విద్యుత్ స్తంభాలు పడిపోవడం, చెట్లు కూలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పునరావాస కేంద్రానికి ప్రజలను తరలించి అక్కడ వారికి మౌలిక వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. చలి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారిపై కి నీళ్ళు వచ్చి చేరాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.
డోర్నకల్ నియోజకవర్గంలో ఉధృతంగా ఆకేరు, మున్నేరు వాగులు
మరోపక్క ములుగు జిల్లా లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏటూరునాగారం లోని వివిధ గ్రామాలకు, ములుగు లోని వివిధ ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మోరంచ వాగు, బొగ్గుల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా లోని డోర్నకల్ నియోజకవర్గంలో ఆకేరు ,మున్నేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది .ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. వర్షాలతో ఇళ్ళు ముంపుకు గురి కాగా ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారు. అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, సహాయక చర్యల్లో నిమగ్నమైంది.